
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ భ్రష్టుపట్టడానికి అవినీతే ప్రధాన కారణమని ఆ దేశ మాజీ ప్లేయర్ జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. ఈ అవినీతిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్గా తీసుకోకపోవడంతో జట్టుకు మరింత అప్రతిష్ట చేకూరిందన్నాడు. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడి వల్ల వచ్చిన చెడ్డ పేరు కన్నా ఇదే ఎక్కువని ఈ పాక్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
'అవినీతి మకిలీ పాకిస్థాన్ క్రికట్ను భ్రష్టుపట్టించింది. పీసీబీ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో కుంభకోణాలకు దారి తీశాయి. ఇది పాక్ క్రికెట్ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది. ఎంతలా అంటే లంక జట్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడితో వచ్చిన చెడ్డ పేరుకన్నా.. ఇదే పాక్ క్రికెట్ పురోగతిని దెబ్బతీసింది.అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా.. ఉపేక్షించడం వల్ల యువ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఈ కారణంగానే పాక్ క్రికెట్పై గౌరవం లేకుండా పోయింది'అని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు.
ఆసియా బ్రాడ్మన్గా పేరొందిన జహీర్ అబ్బాస్.. పాకిస్థాన్ తరఫున 78 టెస్టులు.. 62 వన్డేలు ఆడాడు. సంప్రదాయక ఫార్మాట్లో 12 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 5062 పరుగులు చేసిన ఈ పాక్ మాజీ కెప్టెన్ వన్డేల్లో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 2572 పరుగులు చేశాడు.
పాక్ క్రికెట్లో అవినీతిని అడ్డుకునేందుకు కఠిన చట్టం తీసుకురాబోతున్నామని పీబీబీ ఛీఫ్ ఎహ్సెన్ మణి ఇటీవల వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించినట్లు కూడా తెలిపారు.