Zaheer Abbas: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాకిస్థాన్తో నెలకొన్న వివాదానికి ఇండియానే ప్రధాన కారణమని పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ తెలిపాడు. ఇండియానే ఆటలోకి రాజకీయాలను తీసుకొచ్చిందని ఆరోపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నిర్ణయంపై పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.. భారత్తో ఎట్టిపరిస్థితుల్లో ఆడబోమని మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. భద్రతా కారణాలతో భారత్లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. దాంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం కల్పించిన విషయం విదితమే.
ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన పీసీబీ.. బంగ్లాదేశ్కు అండగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026 నుంచే తప్పుకుంటామని హెచ్చరించింది. చివరకు భారత్తో మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన జహీర్ అబ్బాస్.. ఇరు జట్ల తీరును తప్పుబట్టాడు. ఈ వివాదాన్ని మొదలు పెట్టింది టీమిండియానే అని తెలిపాడు. పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోకపోవడంతోనే తమ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు.

ఆటలో రాజకీయాలను భాగం చేయవద్దని, సోదరుల్లా మ్యాచ్ ఆడాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేశాడు. ప్రపంచంలోనే భారత్, పాక్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ మరో మ్యాచ్కు ఉండదని, ఐసీసీకి కూడా ఈ మ్యాచ్ ద్వారానే ఆదాయం వస్తుందని సూచించాడు. 'షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆసియా కప్ టైటిల్ను స్వీకరించకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. నేను చెప్పేది ఏంటంటే ఇరు దేశాలు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉండండి. క్రికెట్ ఆడండి. ఈ క్రీడలో రాజకీయాలను చేర్చకండి. ఇది చాలా మంచి ఆట. మనం కలిసి ఆడాలి.
మనం సోదరుల్లా పోటీపడాలి. ఎవరికీ హాని తలపెట్టకుండా.. ఎటువంటి గొడవలు లేకుండా నిరంతరం ఆడుతూనే ఉండాలి. ఏమీ లేకుండా అంటే.. ఒక పొరుగు దేశంతో ఆడుతున్నట్లే మనం ఆడాలి. ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ మరే మ్యాచ్కూ ఉండదు. ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్లతోనే ఐసీసీకి ఎక్కువ ఆదాయం వస్తుంది. క్రికెట్కు కూడా మేలు జరుగుతుంది.
క్రీడలు, రాజకీయాలను వేరుగా చూడాలి. రాజకీయాలతో ఆటగాళ్లు, అభిమానులు నష్టపోకూడదు. మైదానంలో ఆటగాళ్లు ఎంత తీవ్రంగా పోటీ పడినా.. మైదానం బయట వారు పంచుకునే స్నేహం రెండు దేశాల ప్రజల మధ్య సయోధ్యకు దారి తీస్తుంది.'అని ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ అబ్బాస్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ జరగకపోతే రూ.4500 కోట్ల నష్టం వాటిల్లనుంది. మరోవైపు పాకిస్థాన్పై ఐసీసీ ఆంక్షలు విధించనుంది.