టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు సంబంధించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. తన సతీమణి ధనశ్రీ వర్మతో చాహల్ విడాకుల అంశం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా చాహల్ ఓ అమ్మాయితో కెమెరాలకు చిక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ముంబైలోని జేడబ్ల్యూ మారియల్ హోటల్లో ఓ అమ్మాయితో చాహల్ కనిపించాడు. ఆమెతో కలిసి హోటల్ బయటకు వచ్చే సమయంలో మీడియాను చూసి చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని కనిపించాడు. వైట్ టీ-షర్ట్, బ్యాగీ జీన్స్తో ధరించిన చాహల్.. కెమెరాల కంటపడకుండా ఉండేందుకు ఆపసోపాలు పడ్డాలు. హోటల్ పిల్లర్స్ వెనుకాల దాక్కోవడం, చేతులను కవర్ చేసుకోవడం వంటి పనులు చేశాడు. ఈ చర్యలతో ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే సదరు యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు ప్రచారం జరుగుతోంది. ధనశ్రీతో పరిచయం కాకముందే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఈ వార్తలను చాహల్ ఖండించాడు.
పెళ్లి అయిన తర్వాత కూడా తనిష్క కపూర్తో చాహల్ సీక్రెట్ అఫైర్ నడిపించాడని, దాంతో ధనశ్రీతో గొడవలు మొదలయ్యాయనే వాదను కూడా తెరపైకి వచ్చింది. చాహల్ వ్యవహారం నచ్చకనే ధనశ్రీ వర్మ విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తన సతీమణి ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకునేందుకు సిద్దమైనట్లు గత వారం రోజులుగా వార్తలు హల్ఛల్ చేస్తున్నాయి. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చాహల్.. ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు బలం చేకూరింది. అంతేకాకుండా చాహల్ సన్నిహిత వర్గాలు విడాకుల విషయాన్ని ధ్రువీకరించాయని నేషనల్ మీడియా పేర్కొంది.
ఇప్పటి వరకు అయితే చాహల్-ధనశ్రీ వర్మలు తమ విడాకుల అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాహల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా క్రిప్టిక్ పోస్ట్లు షేర్ చేస్తున్నాడు. 'నిశబ్దం లోతైన స్వరం, అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినబడుతోంది'అనే కొటేషన్ షేర్ చేశాడు. మరో పోస్ట్లో తల్లితండ్రులను గౌరవించండని పేర్కొన్నాడు. అతని పోస్ట్లు విడాకుల అంశానికి దగ్గరగా ఉండటంతో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు విశ్వసిస్తున్నారు.