
బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన క్రికెట్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తోనే పునరుద్దరించాలని భారత లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ అభిప్రాయపడ్డాడు. బంతి స్వింగ్ కోసం ఉపయోగించే ఉమ్మిని నిషేధిస్తే.. బ్యాట్స్మన్కు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నాడు.
తాజాగా ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన చహల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'ఐపీఎల్తో క్రికెట్ను పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది. అది దాదాపు రెండునెలలు సాగుతుంది కాబట్టి ఆటగాళ్లు మళ్లీ సన్నద్ధమవ్వడానికి ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ప్రకారం వేరే సిరీస్లతో మళ్లీ ఆడించేకంటే ఐపీఎల్తో ముందుకెళ్లడం మంచిది' అని చహల్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆట తిరిగి ప్రారంభమైనా స్వల్ప మార్పులుండే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులు ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే టోర్నీలు నిర్వహించే అవకాశం ఉందని, ఆటలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటాయంటున్నారు. ఒకప్పటిలా ఆటగాళ్ల హగ్గింగ్లు.. టచింగ్లతో కూడా సెలబ్రేషన్స్ ఇక ఉండకపోవచ్చని, బంతి మెరవడానికి బౌలర్లు ఉమ్ము వాడే పద్ధతినీ అనుమతించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన చహల్.. బంతి మెరవడానికి ఉమ్మును అంటించకపోతే అది బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారుతుందన్నాడు. 'ఉమ్ము ఉపయోగించకపోతే బంతి స్వింగ్, డ్రిఫ్ట్పై ప్రభావం పడుతుంది. అది బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారుతుంది' అని తెలిపాడు. ఇలా అయితే ఓ కొత్త నిబంధనను తేవాలని సరదాగా వ్యాఖ్యానించాడు. ' ఉమ్మిని వాడనివ్వకపోతే.. మరో నిబంధన తేవాలి. ఒకవేళ బ్యాట్స్మన్ సిక్స్ కొడితే అతనే వెళ్లి బంతి తెచ్చుకోవాలి' అన్నాడు. అనంతరం లాక్డౌన్పై స్పందించిన చహల్.. తనకు మొదట్లో ఇంట్లో ఉండడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు. ఇప్పుడు అలవాటు పడ్డానన్నాడు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలంగా ఆలోచించాలని, తన జీవితంలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఇంట్లో లేనని తెలిపాడు.