టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాత్రూమ్లో ఏడవడం చూశానని వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమిని కోహ్లీ తట్టుకోలేకపోయాడని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారని చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో సెమీస్ చేరిన భారత్.. తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ రెండు రోజుల పాటు జరగ్గా.. టీమిండియా గెలుపు కోసం జడేజా, ధోనీ ఆఖరి వరకు పోరాడారు. కానీ చివర్లో ధోనీ రనౌట్గా వెనుదిరిగడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆ పరాజయాన్ని భారత అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాహల్.. ఈ మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. '2019 వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఓటమి తట్టుకోలేక కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. అతనే కాదు జట్టులోని ఆటగాళ్లంతా ఏడ్చారు. నేనే చివరిగా క్రీజులో నుంచి వచ్చా. కోహ్లీని దాటి ముందుకెళ్తుంటే అప్పటికే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ధోనీకి అదే ఆఖరి మ్యాచ్. ఆ క్షణమే బౌలింగ్లో నేను 15 పరుగులు తక్కువగా ఇవ్వాల్సిందని అనిపించింది. నేను ఇంకొంచెం ఉత్తమంగా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేదనిపించింది.'అని చాహల్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో చాహల్ 10 ఓవర్లో 63 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసాడు.

ఈ ఓటమి కారణంగా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఒక్క ఐసీసీ టైటిల్ను అందించలేకపోయాడు. అతని సారథ్యంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. అతని సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరడం, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ చేరింది. కానీ తృటిలో టైటిల్ అందుకోలేకపోయింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.