న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చూడగానే తనకు ఎక్కడలేని క్రమశిక్షణ వచ్చేస్తుందని, అతను ముందు ఉంటే తన నోటి నుంచి మాటలు కూడా రావని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఇక మైదానంలో చాహల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్లోనూ చాహల్ జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. ప్రతీ ఒక్కరిని తన పనులతో విసిగిస్తుంటాడు. అంత అల్లరిగా ఉండే చాహల్.. ధోనీని చూడగానే క్రమశిక్షణగా మారిపోతాడంట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

'కేవలం ధోనీ ముందు మాత్రమే నేను సైలెంట్గా ఉంటాను. అతను నా ముందుకు వచ్చేసరికి నా నోరు ఆటోమేటిక్గా మూతపడుతోంది. ధోనీ భాయ్ ముందు అనవసర విషయాలు మాట్లాడను. ధోనీ అడిగిన వాటికే సమాధానమిస్తాను. లేకపోతే మౌనంగా కూర్చుంటాను. ధోనీ భాయ్ నాకు చాలా మద్దతు ఇచ్చేవాడు. నాది కానీ రోజు కూడా అండగా ఉండేవాడు.
గతంలో సెంచూరియన్ వేదిగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో నేను ధారళంగా పరుగులిచ్చుకున్నాను. 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాను. హెన్రిచ్ క్లాసెన్ అయితే బౌలింగ్ను దంచికొడుతున్నాడు. వెంటనే ధోనీ నా వద్దకు వచ్చి రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేస్తావా? అని అడిగాడు. నేను అలానే బౌలింగ్ చేశాను.
అయినా క్లాసెన్ సిక్స్ బాదాడు. మళ్లీ నా వద్దకు వచ్చిన ధోనీ ఈ రోజు నీది కాదు. దిగులు పడకు. మిగిలిన ఐదు బంతులు బౌండరీలు ఇవ్వకుండా చూసుకో. అది జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. నాది కానీ రోజు కూడా ధోనీ మద్దతుగా నిలిచాడు.'అని చాహల్ గుర్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు 72 వన్డేలు ఆడిన చాహల్.. 121 వికెట్లు పడగొట్టాడు. 75 టీ20ల్లో 91 వికెట్లు తీసాడు.
ధోనీ సారథ్యంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఓ వెలుగు వెలిగారు. ఇద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించారు. కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత కుల్దీప్ దూరం కాగా.. చాహల్ ఒక్కడే జట్టులో కొనసాగాడు. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ల్లో చాహల్ను ఆడించకపోవడం టీమిండియాకు తీరని నష్టం చేసింది.