
న్యూఢిల్లీ: కెరీర్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ దగ్గరికెళ్లాలంటే చాలా భయమేసేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. వికెట్లు తీయకపోతే కోహ్లీ తనపై అరిచేవాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలంపాటు కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీకి ఆడిన యుజ్వేంద్ర చాహల్ ఈ సారీ వేరే ఫ్రాంచైజీకీ ఆడే పరిస్థితి వచ్చింది. ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో అతను వేలానికి అందుబాటులో ఉన్నాడు. తాజాగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన చాహల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆర్సీబీలో తన తొలినాళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
'నేను 2014లో తొలిసారి ఆర్సీబీ జట్టులోకి వెళ్లినప్పుడు చాలా ఆందోళనగా ఉండేది. మైదానంలో కోహ్లీని చూస్తే భయమేసేది. నేను బౌలింగ్ చేసేటప్పుడు అతను కవర్స్లో ఫీల్డింగ్ చేస్తూ చాలా దూకుడుగా, ఎనర్జిటిక్గా ఉండేవాడు. అప్పుడు నేను యవకుడిగా ఉండటంతో ఒక్కోసారి వికెట్లు తీయకపోతే నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. అయితే, నేను వికెట్లు తీసినప్పుడు నా కోపాన్ని ప్రదర్శించడానికి అతనివైపు వెళ్లకుండా బ్యాట్స్మెన్ వద్దకెళ్లేవాడిని. అలా రెండుమూడు సార్లు జరగడంతో మ్యాచ్ రిఫరీ నా గురించి అప్పటి ఆర్సీబీ కోచ్ డానియల్ వెటోరీకి చెప్పాడు.
ఆ సమయంలోనే నేనొక మ్యాచ్లో హద్దులు ధాటి ప్రవర్తించాను. ఆరోజు వెటోరీ నా వద్దకొచ్చి ఇది సరైన పద్ధతి కాదని మందలించాడు. నాలో మంచి నైపుణ్యం ఉందని, ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్లు తీసినప్పుడు నాకు పరిగెత్తాలనిపిస్తే కవర్స్వైపు పరిగెత్తమని సలహా ఇచ్చాడు. అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటాడని, దాంతో అతని వద్దకెళ్లి ఏం చెప్పాలనిపిస్తే అది అతనికే చెప్పమని సూచించాడు. కోహ్లీ ఏం అనుకోడని నాకు వివరించాడు' అని చాహల్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకొన్నాడు.