
న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో చాహల్ ఒక్క వికెట్ తీస్తే ఈ ఫార్మాట్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న 23వ భారత బౌలర్గా గుర్తింపు పొందుతాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 269 వన్డే మ్యాచ్లు ఆడిన అనిల్ కుంబ్లే 334 వికెట్లు పడగొట్టాడు.
హర్యానాకు చెందిన 31ఏళ్ల చాహల్ వన్డేల్లో ఇప్పటివరకు 59 మ్యాచ్లు ఆడి 27.88 ఎకానమీతో 99 వికెట్లు తీశాడు. 2016 జూన్లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో రెండుసార్లు వరుసగా ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 2017లో 21 వికెట్లు, 2018, 2019లో 29 చొప్పున వికెట్లు పడగొట్టాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 6/42 స్కోర్ అతని అత్యుత్తమ ప్రదర్శన. 2019 వన్డే వరల్డ్ కప్లో బరిలోకి దిగిన భారత జట్టులో చాహల్ కీలక బౌలర్. ఈ టోర్నమెంట్లో 74 ఓవర్లు వేసిన యుజ్వేంద్ర.. 36.83 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు.
అయితే గతేడాది కాలంగా చాహల్ తన ఫామ్ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. మునపటిలా వికెట్లు తీయకపోగా.. ధారళంగా పరుగులిచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా పర్యటనతో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయినా వెస్టిండీస్ పర్యటనకు అతనికి అవకాశం దక్కింది.
ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్ కోసం టీమిండియా అహ్మదాబాద్కు చేరుకుంది. మూడు వన్డేలు ఇదే వేదికగా జరగనున్నాయి. బయో బబుల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా మూడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నారు.
ఈ వన్డే సిరీస్ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ నిలువనుంది. తొలి వన్డేతోనే టీమిండియా ఈ ఘనతను అందుకోనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచిపోనున్నాడు. గత ఏడాది డిసెంబరులో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన భారత సెలెక్టర్లు.. రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మకి ఇదే ఫస్ట్ మ్యాచ్ కావడం విశేషం.