టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా వేదికగా తన సతీమణి ధనశ్రీ వర్మకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా చాహల్ ధనశ్రీ వర్మకు భావోద్వేగపూరిత సందేశాన్నిచ్చాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని కవి అవతారం ఎత్తాడు. ప్రస్తుతం చాహల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారుతోంది.
'మై డియర్ వైఫ్.. మనం తొలిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం వరకు ఈ ప్రయాణంలోని ప్రతీ సెకను నా గుండెకు ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు రాసారో గానీ.. నా కోసమే రాసినట్లుంది. ప్రతీ రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నా జీవితం సంపూర్ణమైంది. నాలో సగమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు'అని యుజ్వేంద్ర చాహల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్కు తన సతీమణితో దిగిన అందమైన ఫొటోలను జత చేశాడు.

చాహల్ కవి హృదయానికి స్పందించిన ధనశ్రీ వర్మ.. పరస్పర అంగీకారంతోనే తమ వివాహ బంధం మూడేళ్లు పూర్తి చేసుకుందని బదులిచ్చింది. ఈ పోస్ట్కు చాహల్తో కలిసి చేసి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.
లాక్ డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవడానికి యూట్యూబర్, కొరియో గ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను చాహల్ సంప్రదించాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. మూడేళ్ల క్రితమే (2020, డిసెంబర్ 22) వీరి వివాహం జరిగింది. అయితే ఏడాది క్రితం ధనశ్రీ వర్మ తన ఇన్స్టా అకౌంట్లో చాహల్ ఇంటి పేరును తొలగించడంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
అంతేకాకుండా ధనశ్రీ వర్మ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో చనువుగా ఉండటంతో ఆమెతో పాటు చాహల్ జుగుప్సాకరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. చాహల్ లేకుండా అయ్యర్తో ధనశ్రీ వర్మ పలు పార్టీల్లో కనిపించడంతో ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చాహల్ జోడీ ఖండించింది. ఈ తరహా వార్తలు రాసిన మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకొని సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన చాహల్కు నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.