టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఆల్టైమ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనపెట్టాడు. ప్రపంచంలోనే మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి దిగ్గజ కెప్టెన్కు యువరాజ్ సింగ్ తన జట్టులో చోటివ్వలేదు.
భారత్ నుంచి సచిన్ టెండూల్కర్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసిన యువ రాజ్ సింగ్ ఒక్క భారత బౌలర్కు అవకాశం ఇవ్వలేదు. 1983 ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ పేరును కూడా విస్మరించాడు. యువరాజ్ సింగ్ ఆల్టైమ్ ఎలెవన్ అని చెప్పినా.. తన తరం ఆటగాళ్లనే ఎక్కువగా ఎంపిక చేశాడు.

సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్లను ఓపెనర్గా ఎంపిక చేసిన యువరాజ్ సింగ్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 3,4వ స్థానాల్లో తీసుకున్నాడు. ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్లను ఫినిషర్లుగా ఎంపిక చేసిన యూవీ.. దివంగత స్పిన్నర్ షేన్ వార్న్, ముత్తయ్య మురళీదరణ్లను స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. మెక్గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్లను పేసర్లుగా ఎంపిక చేశాడు.
ధోనీతో ఉన్న విభేదాల నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ అతన్ని ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. యువరాజ్ సింగ్ సైతం ఓ ఇంటర్వ్యూలో ధోనీతో తనకు స్నేహితుడు కాదని చెప్పాడు. తాము సహచర ఆటగాళ్లం మాత్రమేనని స్పష్టం చేశాడు.
'ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు నేను వైస్ కెప్టెన్. నేను జట్టులోకి వచ్చినదాని ప్రకారం అతను నా కంటే నాలుగేళ్లు జూనియర్. కెప్టెన్, వైస్ కెప్టెన్ల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజం. కొన్నిసార్లు అతను తీసుకునే నిర్ణయాలు నాకు నచ్చకపోవచ్చు. మరికొన్ని సార్లు నా నిర్ణయాలు అతనికి నచ్చకపోవచ్చు. ఇది ప్రతీ జట్టులో జరిగేదే.
సహచర ఆటగాడు బెస్ట్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది. జట్టులోని కొందరు మాత్రమే సన్నిహితంగా ఉంటారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావాల్సిన అవసరం లేదు. ఏ జట్టును తీసుకున్నా.. అందరూ ఫ్రెండ్స్గా ఉండరు. అయితే మైదానంలో దిగినప్పుడు మాత్రం ఈగోలను పక్కనపెట్టి దేశం కోసం ఆడాల్సి ఉంటుంది.'అని ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ ఆల్టైమ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీదరణ్, మెక్గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్