టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ బ్యాట్స్మన్ అతనేనని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఈ జెనరేషన్ అత్యుత్తమ బ్యాటర్. ఈ తరంలో అతను అన్నీ రికార్డులను బద్దలు కొట్టాడు. అతని కెరీర్లో ఏదైనా లోటు ఉందా? అంటే అది వరల్డ్ కప్ మెడల్. ఇప్పటికే ఒకటి గెలిచినా.. దానికి కోహ్లీ సంతృప్తిగా లేడు. వరల్డ్ కప్ మెడల్ అందుకోవడానికి అతను పూర్తి అర్హుడు.

2014 టీ20 ప్రపంచకప్లో కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని కెరీర్లోనే అతను అప్పుడు అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. అతను బంతిని అద్భుతంగా బాదాడు. ఫైనల్లో అతనితో నేను చిన్న భాగస్వామ్యంలో భాగమయ్యాను. ఆ తర్వాత ధోనీతో కలిసి బ్యాటింగ్ కొనసాగించాడు.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ను టీ20 ప్రపంచకప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నియమించింది. ఇప్పటికే జమైకన్ పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను ప్రచారకర్తలుగా నియమించిన ఐసీసీ.. మూడో బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ను ఎంపిక చేసింది.
అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఐసీసీ.. అగ్రరాజ్యం వేదికగా ప్రపంచకప్ నిర్వహిస్తోంది. న్యూయార్క్తో పాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్ను ప్రారంభించనుంది.