న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అప్కమింగ్ వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ దుమ్ములేపుతాడని జోస్యం చెప్పాడు. తుఫాన్ ముందు ప్రశాంతతలా అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదని, మెగా టోర్నీలో ఆ పరుగుల లోటును తీర్చుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. విండీస్తో వన్డే సిరీస్లో ఒకే మ్యాచ్ ఆడిన రోహిత్ పెద్దగా పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ ఫామ్పై స్పందించిన యువ రాజ్ సింగ్ అతని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాడు.

'రోహిత్ శర్మ అంత గొప్ప ఫామ్లో లేడు. కొన్నేళ్లుగా అతని బ్యాట్ నుంచి స్థాయికి తగ్గ పరుగులు రాలేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
2019 ప్రపంచకప్ ముందు కూడా రోహిత్ శర్మ ఇదే తరహా బ్యాటింగ్ కనబర్చాడు. సరైన ఫామ్లో లేడు..
ఆ మెగా టోర్నీ ముందు రోహిత్ శర్మ నన్ను కలిశాడు. ఫామ్ గురించి ఆందోళనకు గురయ్యాడు. అప్పుడు సంథింగ్ స్పెషల్ రాబోతోంది. నిరాశపడకుండా నీ జోన్లో ఉండమని సూచించాను. ఆ ప్రపంచకప్లో రోహిత్ శర్మ 5 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పుడు కూడా ప్రపంచకప్ ముందు ఫామ్లో లేడు. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నట్టు ఉన్నాడు.
ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నమ్ముతా నేను. నా విషయంలోనూ ఇదే జరిగింది. సచిన్ టెండూల్కర్ కూడా నాతో ఇదే చెప్పారు. ఏం జరిగినా నిరాశ చెందవద్దని భరోసా ఇచ్చారు. 'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఇక 2011 వన్డే ప్రపంచకప్ ధోనీ ఒక్కడి వల్లనే రాలేదని, సమష్టి ప్రదర్శన కనబరిస్తేనే ప్రపంచకప్ దక్కుతుందని యువీ స్పష్టం చేశాడు. 'ధోనీ మంచి కెప్టెన్. అయితే అతనికి మంచి టీమ్ దొరకడం వల్లే ప్రపంచకప్లు సాధించగలిగాడు. రోహిత్ శర్మ కూడా మంచి సారథే. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డు చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.

అయితే ప్రపంచ కప్ గెలవాలంటే బెస్ట్ కెప్టెన్తో పాటు మంచి టీమ్ కూడా కావాలి. భారత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ లేదు. ఓపెనర్లు త్వరగా ఔటైతే ఆడగల ప్లేయర్లు కనిపించడం లేదు. ఇలాంటి టీమ్తో వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టం.' అని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.