టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు, ప్రపంచకప్ గెలిచిన సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్లపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ కారణంగానే తన కొడుకు కెరీర్ నాశనమైందని యోగ్ రాజ్ ఆరోపించాడు. అతన్ని ఎప్పటికీ క్షమించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ధోనీ, కపిల్ దేవ్ కంటే తన కుమారుడైన యువరాజ్ సింగ్ గొప్పవాడని చెప్పుకొచ్చాడు. 1983 ప్రపంచకప్ గెలవడం మినహా కపిల్ దేవ్ సాధించిందేం లేదని విమర్శించాడు. యోగ్ రాజ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే యోగ్ రాజ్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

మా నాన్నకు పిచ్చి..
ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్.. తన తండ్రి ఓ పిచ్చోడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ విషయాన్ని అతను అంగీకరించడం లేదని తెలిపాడు. 'మా నాన్న మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ ఆయన ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. ఆయన తన సమస్యను గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది.'అని గతేడాది నవంబర్లో ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
తాజాగా ధోనీ, కపిల్ దేవ్పై యోగ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు యువీ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. యోగ్ రాజ్ పిచ్చోడని, అతని కొడుకే చెబుతున్నాడని, ధోనీ గురించి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు.
ధోనీని క్షమించను..
'నా కుమారుడి జీవితాన్ని ధోనీ నాశనం చేశాడు. తానే ఏం చేశాడనేది అద్ధంలో చూసుకుంటే అతనికే అర్థమవుతుంది. నేను అయితే ధోనీని ఎప్పటికీ క్షమించను. అతను గొప్ప అటగాడే. కానీ నా కొడుకు యూవీ కెరీర్ను దెబ్బతీశాడు. ఒకవేళ ధోనీ గనుక అడ్డు లేకుంటే నా బిడ్డ మరో నాలుగైదు ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు.
మా తరంలో కపిల్ దేవ్ అత్యుత్తమ కెప్టెన్. కానీ అతను నా కొడుకు కంటే గొప్ప ఆటగాడు ఏం కాదు. యువరాజ్ సింగ్ 13 ట్రోఫీలు గెలిస్తే కపిల్ దేవ్ ఒకే ఒక్క ప్రపంచకప్ గెలిచాడు.'అని యోగ్రాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అవేశంగా చెప్పుకొచ్చాడు. 1980-81లో యోగ్ రాజ్ భారత్ తరఫున ఒక టెస్ట్, 6 వన్డేలు ఆడాడు. అయితే కపిల్ దేవ్ కారణాంగానే తాను జట్టులో చోటు కోల్పోయాని గతంలో యోగ్ రాజ్ ఆరోపించాడు.