ధోనీ నా భవిష్యత్తును కళ్లకు కట్టాడు:
తాజాగా యువరాజ్ సింగ్ న్యూస్ 18తో మాట్లాడుతూ... 'నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్ కోహ్లీ నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. కానీ ఎంఎస్ ధోనీ నా నిజమైన భవిష్యత్ను చూపించాడు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపికలో సెలక్టర్లు నన్ను పరిగణలోకి తీసుకోరని చెప్పాడు. 2011 ప్రపంచకప్ వరకూ నాపై ధోనీకి చాలా విశ్వాసం ఉండేది. నేనే తన ప్రధాన ఆటగాడినని చెబుతుండేవాడు. కానీ క్యాన్సర్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినపుడు మొత్తం మారిపోయింది' అని తెలిపాడు.
ఎవరినీ బాధ్యుల్ని చేయడానికి లేదు:
'2015 ప్రపంచకప్ నుంచి నన్ను తప్పించడం విషయానికి వస్తే ఎవరినీ బాధ్యుల్ని చేయడానికి లేదు. ఓ కెప్టెన్ అన్నింటికీ న్యాయం చేయలేడని అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే చివరకు దేశం తరపున జట్టు ప్రదర్శన ఎలా ఉంది అనేదే ముఖ్యం' అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. తన 17 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్లో యువీ ఎందరో విజయవంతమైన కెప్టెన్ల ఆధ్వరంలో ఆడాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2011 ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. భారత్ తరఫున 2000లో అరంగేట్రం చేసిన యువీ.. 2017లో చివరి మ్యాచ్ ఆడాడు.
పంజాబ్ జట్టుకు మార్గనిర్దేశం:
ప్రస్తుతం 21 రోజుల శిబిరంలో పంజాబ్ జట్టుకు యువరాజ్ సింగ్ మార్గనిర్దేశం చేస్తున్నాడు. తాజాగా యువీ మాట్లాడుతూ... '21 రోజుల శిబిరంలో పంజాబ్ జట్టుకు మార్గనిర్దేశం చేయడం బాగుంది. ఆట మొదలు పెట్టినప్పుడు నాకు ఎంతో మంది మెంటార్లు ఉండేవారు. క్రికెట్, స్కేటింగ్ నేను ప్రేమించే క్రీడలు. ఇప్పుడు ఖాళీ సమయం ఉండటంతో గోల్ఫ్ నేర్చుకుంటున్నా. ఇది ఒక వ్యసనమైన క్రీడ. ఇప్పుడు నేను గోల్ఫ్ బాగా ఆడుతున్నా. అంతర్జాతీయ క్రికెట్ లీగులు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లీగులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం' అని యువీ పేర్కొన్నాడు.
హాఠాత్తుగా రిటైర్మెంట్:
గతేడాది వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. యువరాజ్ సింగ్ భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.