బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో కొవిడ్-19 టాస్క్ఫోర్స్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఏర్పాటు చేయనుంది. దేశంలో క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ)లో బీసీసీఐ ఈ విషయం పేర్కొంది. ద్రవిడ్ నేతృత్వంలో పరిశుభ్రత అధికారి, బీసీసీఐ ఏజీఎం (క్రికెట్ ఆపరేషన్స్) సభ్యులుగా ఉండే టాస్క్ఫోర్స్.. ఎన్సీఏలో శిక్షణను పర్యవేక్షిస్తుంది.
'కరోనా వైరస్ నియంత్రణ చర్యల్ని స్పష్టంగా, క్రమం తప్పకుండా ఆటగాళ్లకు తెలియజేయడం.. క్రికెటర్లు నిబంధనల్ని కచ్చితంగా పాటించేలా చూడటం టాస్క్ఫోర్స్ విధులు. ఎన్సీఏలో శిక్షణ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, సహాయక.. పరిపాలన సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్ఓపీలో పేర్కొన్న నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటిస్తానంటూ ఎన్సీఏకు రాకముందే ఆటగాళ్లు సమ్మతి పత్రాన్ని అందజేయాలి' అని ఎస్ఓపీలో బీసీసీఐ పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మార్చిలో జరగాల్సిన ఐపీఎల్-2020 సైతం వాయిదా పడింది. ఆసియా కప్, ప్రపంచకప్ వాయిదా పడటంతో సెప్టెబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమైంది. 2019-20 దేశవాళీ సీజన్ మార్చిలోనే ముగిసింది. సాధారణంగా ఆగస్టులో మళ్లీ మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి సీజన్ను కుదించే అవకాశం ఉంది.
ప్రస్తుతం నిర్వహించే ట్రైనింగ్ క్యాంప్స్లో పాల్గొనే ఆటగాళ్లు కరోనా రిస్క్ను అంగీకరిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసేవరకు అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులు శిబిరాలకు రాకుండా నిషేధం విధించింది. క్రికెటర్లు ఇంటి నుంచి స్టేడియానికి, అట్నుంచి శిబిరానికి వెళ్లేటప్పుడు కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న రొనాల్డో.. ధర తెలిస్తే షాకే!!