ఆ సమయంలో ధోనీకి బదులు నాకే కెప్టెన్సీ ఇస్తారనుకున్నా: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీకి బదులు తనకే జట్టు సారథ్య బాధ్యతలు ఇస్తారని భావించానని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. కానీ సెలెక్టర్లు ధోనీని కెప్టెన్ చేశారని, దాంతో టీమ్ మెంబర్గా అతనికి మద్దుతుగా నిలిచానని ఈ సిక్సర్ల సింగ్ గుర్తు చేసుకున్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ ఘోర పరాజయం తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా అరంగేట్ర టీ20 ప్రపంచకప్ టోర్నీలోకి బరిలోకి దిగిన ధోనీసేన దుమ్మురేపింది. సూపర్ పెర్ఫామెన్స్తో ఫస్ట్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆ విజయంతో ధోనీకి తిరుగేలేకుండా పోయింది.
వాస్తవానికి ఈ ఫార్మాట్ పట్ల బీసీసీఐ, టీమిండియా సీనియర్ క్రికెటర్లు అప్పట్లో అయిష్టతను వ్యక్తం చేశారు. దాంతోనే సచిన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఈ టోర్నీ ఆడకుండా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. అయితే జట్టులో సీనియర్ అయిన యువరాజ్ సింగ్కు కెప్టెన్సీ ఇస్తారని భావించినా సెలెక్టర్లు అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటుతున్న ధోనీకి అవకాశమిచ్చారు.

గందరగోళం మధ్య..
తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టోర్నీకి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకున్న యువీ.. ఆ సమయంలో కెప్టెన్సీ ఆశించానని తెలిపాడు.'2007 వన్డే వరల్డ్కప్లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తి గందరగోళం నెలకొంది. ఆ తర్వాత భారత్ రెండు నెలలు ఇంగ్లండ్లో, ఓ నెల సౌతాఫ్రికా, ఐర్లాండ్లో పర్యటించింది. దాంతో సుమారు నాలుగు నెలలపాటు ఆటగాళ్లంతా ఇళ్లకు దూరంగా ఉన్నారు. అయితే మరుసటి నెలలోనే టీ20 ప్రపంచకప్ ఉండటంతో సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి కోరుకున్నారు.

కెప్టెన్సీ ఇస్తారనుకున్నా..
ఎవరూ కూడా టీ20 ప్రపంచకప్ను సీరియస్గా తీసుకోలేదు. దాంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకే ఇస్తారనుకున్నా. కానీ సెలెక్టర్లు ధోనీ పేరు ప్రకటించారు. ఇక ఎవరు కెప్టెన్ అయినా ఓ ఆటగాడిగా రాణించడం, కెప్టెన్ అండగా నిలవడం ముఖ్యం. అది రాహుల్ ద్రవిడ్ అయినా.. గంగూలీ అయినా, మరెవరైనా టీమ్ మ్యాన్గా రాణించడం కనీస బాధ్యత. ఆ టోర్నీలో నేను అదే చేశా'అని యువీ చెప్పుకొచ్చాడు.

12 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఇక కెప్టెన్సీ చేజారినా టీమ్ మ్యాన్గా యువీ ఈ టోర్నీలో సత్తా చాటాడు. 6 మ్యాచ్ల్లో 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్స్లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఆ విధ్వంసంతో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే చెక్కుచెదరకుండా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ టీషర్ట్ చూస్తే చితక్కొడుతారు..
ఇక 2007 వన్డే వరల్డ్ కప్ పరాజయం తర్వాత హర్భజన్ సింగ్, తాను పంజాబ్ రాకుండా ఇంగ్లండ్లో దాక్కున్నామని యువీ చెప్పుకొచ్చాడు. '2007 వన్డే ప్రపంచకప్ పరాజయం తర్వాత నేను, భజ్జీ భయ్యా ఇంగ్లండ్లో దాక్కున్నట్లు గుర్తుంది. ఎందుకంటే పంజాబ్కు వెళ్తే మమ్మల్ని చితక్కొడుతారని తెలుసు. అయితే ఇంటికి వచ్చే సమయంలో నేను ఓ టీషర్ట్ ధరించాను. దానిపై ప్లే హార్డ్, గో హోమ్ అనో రాసుందనుకుంట. ఇది చూసిన భజ్జీ ముందు ఆ టీషర్ట్ మార్చేమన్నాడు. ఎవరైనా చూస్తే మనద్దరిని ఇక్కడ చితక్కొడుతారని తెలిపాడు'అని యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications