వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2024 అరంగేట్ర సీజన్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్స్ను ఓడించింది.
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ మైదానం వేదికగా జరిగిన ఈ తుదిపోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్(36 బంతుల్లో 41) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, హర్భజన్ సింగ్లు తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. యూసఫ్ పఠాన్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. గుర్క్రీత్ సింగ్(33 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ యామిన్ 2 వికెట్లు తీయగా.. అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ తలో వికెట్ పడగొట్టారు. రోహిత్ సేన తరహాలోనే యువీ సేన అద్భుత ప్రరద్శనతో టైటిల్ గెలిచింది. 15 రోజుల వ్యవధిలోనే దక్కిన రెండు అద్భుత విజయాలతో భారత అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
ఒత్తిడికి చిత్తయిన పాక్..
ఈ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్.. కీలక ఫైనల్లో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒత్తిడిలో కనిపించింది. షోయబ్ మాలిక్ అద్భుత ఇన్నింగ్స్తో పోరాడే లక్ష్యాన్ని అందుకున్నా విజయం సాధించలేకపోయింది.
157 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. అంబటి రాయుడు, రాబిన్ ఊతప్పలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రాబిన్ ఊతప్ప 10 పరుగులే చేసి ఔటవ్వగా.. సురేశ్ రైనా(4) తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆదుకున్న అంబటి రాయుడు..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గురుక్రీత్ సింగ్తో అంబటి రాయుడు..ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 60 పరుగులు జోడించారు. ఓవైపు రాయుడు దూకుడుగా ఆడగా.. మరోవైపు గురుక్రీత్ సింగ్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో రాయుడు హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ స్లో బ్యాటింగ్తో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. కానీ యూసఫ్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్తో విజయసమీకరణాన్ని మార్చాడు. విజయానికి 7 పరుగుల దూరంలో యూసఫ్ పఠాన్ ఔటవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 2 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతినే బౌండరీ తరలించి ఇర్పాన్ పఠాన్ మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో లీగ్ దశలో పాకిస్థాన్ ఛాంపియన్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇండియా ఛాంపియన్స్ ప్రతీకారం తీర్చుకుంది.