
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పంత్ టీమిండియా సూపర్ ఫినిషర్ అంటూ మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లోపడ్డ భారత జట్టును రిషభ్ పంత్.. హార్దిక్ పాండ్యా(55 బంతుల్లో 10 ఫోర్లతో 71)తో కలిసి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు.
ఈ క్రమంలోనే పంత్పై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, వసీం జాఫర్లు ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సైతం పంత్ ఇన్నింగ్స్ను కొనియాడుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ముప్పావ్ గంట మోటివేషన్ బాగా వర్కౌటైనట్లుందని పంత్తో తాను మాట్లాడిన విషయాన్ని వెల్లడించాడు. 'చూస్తుంటే నీకు ఇచ్చిన 45 నిమిషాల మోటివేషన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. బాగా ఆడావ్ రిషభ్ పంత్. నువ్వు ఇన్నింగ్స్ నిర్మించే విధానం ఇది.. హార్ధిక్ పాండ్యా నువ్వు కూడా చూడచక్కగా ఆడావు.' అంటూ నవ్వుతున్న ఏమోజీలను యువీ పంచుకున్నాడు.
ఇక రిషభ్ పంత్కు యువీ మెంటార్గా సలహాలు సూచనలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో అతనికి బ్యాటింగ్ టిప్స్ చేప్పాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిషబ్ పంత్పై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు కూడా యువీ అతనికి అండగా నిలిచాడు. ధోనీని సెలక్ట్ చేయకుండా రిషభక పంత్కు వరుస అవకాశాలు ఇవ్వడాన్ని అప్పట్లో అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. కెవిన్ పీటర్సన్కు కూడా యువీ తనదైన శైలిలో బదులిచ్చాడు.
'రిషభ్ పంత్ ఇన్ని సార్లు అవుట్ అవ్వడం ఎన్ని సార్లు చూశాం.. ఇందుకే టీమ్కు సెలక్ట్ చేయలేదేమో... బాధాకరం...' అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కి స్పందించిన యువరాజ్ సింగ్... 'అతను ఇప్పటిదాకా ఆడింది 8 వన్డేలే. అది అతని తప్పు కాదు, అతను నేర్చుకుంటాడు. కాబట్టి కాస్త సమయం ఇవ్వండి. ఇందులో బాధకరమైన విషయం ఏమీ లేదు. అయితే మనందరికీ అభిప్రాయాలను పంచుకునే హక్కు ఉంది.' అంటూ రిప్లై ఇచ్చాడు.