టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా యువీ రాజకీయాల్లోకి వస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నమ్తో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటి అయ్యారు. దాంతో ఈ ప్రచారానికి బలం చేకూరుంది. రాజకీయాల్లోకి రావడంపై యువరాజ్ సింగ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నారు. ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఈ నియోజకవర్గం నుంచి గతంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా కూడా ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా 1998, 1999, 2004, 2014లో విజయం సాధించారు. ఇక గురుదాస్పూర్ నియోజకవర్గం భారత్-పాకిస్థాన్ బోర్డర్కు ఆనుకొని ఉంటుంది.
ఇక భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేం కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ కోటాలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై క్రీడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఓవైపు మంత్రిగా కొనసాగుతూనే మరోవైపు రంజీ క్రికెట్ ఆడాడు. ఈ మధ్యనే అన్ని రకాల క్రికెట్కు గుడ్బై చెప్పాడు. తెలుగు తేజం అంబటి రాయుడు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసి సైలెంట్ అయిపోయాడు.