టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ అనంతరం.. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆల్టైమ్ ఎలెవెన్ను ప్రకటించాడు.
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. అయితే ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సింగ్ చోటివ్వలేదు. ప్రపంచంలోనే మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి దిగ్గజ కెప్టెన్కు యువరాజ్ సింగ్ తన జట్టులో చోటివ్వకపోవడం అభిమానులను విస్మయపరిచింది.

డబ్ల్యూసీఎల్ 2024 ఫైనల్లో పాకిస్థాన్ ఛాంపియన్స్ను యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ ఓడించింది. ఈ విజయానంతరం ఈ టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్.. ఆల్టైమ్ ఎలెవన్ను ప్రకటించాలని కోరింది. ఈ జట్టులో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసిన యువరాజ్ సింగ్ .. ధోనీ పేరును విస్మరించాడు.
అయితే ఉద్దేశపూర్వకంగానే ధోనీని యువరాజ్ సింగ్ తప్పించినట్లు అర్థమవుతోంది. ఈ జట్టులో వికెట్ కీపర్గా ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ను ఎంచుకున్నాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ ఓపెనర్గా ఆడేవాడు. కానీ యువీ తన జట్టులో ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలను ఎంపిక చేశాడు. ధోనీకి చోటిచ్చే అవకాశం ఉన్నా యువరాజ్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే తప్పించాడు. చివరకు తన శత్రువైన ఆండ్రూ ఫ్లింటాఫ్ను కూడా యువీ ఈ జట్టులోకి తీసుకున్నాడు.
తనను కాదని టీమిండియా సారథిగా ధోనీని ఎంపిక చేయడంపై యువరాజ్ సింగ్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్గా కొనసాగిన ఈ ఇద్దరి మధ్య చాలా బేధాభిప్రాయాలు ఉండేవి. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు నేను వైస్ కెప్టెన్. నేను జట్టులోకి వచ్చినదాని ప్రకారం అతను నా కంటే నాలుగేళ్లు జూనియర్. కెప్టెన్, వైస్ కెప్టెన్ల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజం. కొన్నిసార్లు అతను తీసుకునే నిర్ణయాలు నాకు నచ్చకపోవచ్చు. మరికొన్ని సార్లు నా నిర్ణయాలు అతనికి నచ్చకపోవచ్చు. ఇది ప్రతీ జట్టులో జరిగేదే.
సహచర ఆటగాడు బెస్ట్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది. జట్టులోని కొందరు మాత్రమే సన్నిహితంగా ఉంటారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావాల్సిన అవసరం లేదు. ఏ జట్టును తీసుకున్నా.. అందరూ ఫ్రెండ్స్గా ఉండరు. అయితే మైదానంలో దిగినప్పుడు మాత్రం ఈగోలను పక్కనపెట్టి దేశం కోసం ఆడాల్సి ఉంటుంది.'అని ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ ఆల్టైమ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీదరణ్, మెక్గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్.