న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్రౌండర్, సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తండ్రయ్యానని, తన సతీమణి హేజల్ కీచ్ పండంటి మగబిడ్డకు జన్మచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 'మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అభిమానులు, కుటుం సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్నిపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం'అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ఇదే పోస్ట్ను హెజల్ కీచ్ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది.
బ్రిటిష్-మారిషియస్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్ను యువరాజ్ సింగ్ 2016లో వివాహం చేసుకున్నాడు. ఇటీవలే వీరు తమ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. యువీ-హెజల్ వీడిపోతున్నారని ఆ మధ్య ప్రచారం జరిగినా అదంతా ఉత్తదేనని స్పష్టమైంది.
❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe
— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022
2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ అనతికాలంలోనే స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటి మేటి ఆల్రౌండర్గా ప్రశంసలు అందుకున్నాడు. భారత్ తరఫున 304 వన్డేలు, 40 టెస్ట్లు, 58 టీ20లు ఆడిన యువీ.. మూడు ఫార్మాట్లో కలిపి 11వేలకు పైగా పరుగులు చేశాడు.
భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లో యువీ పాత్ర కీలకం. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్స్లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్లో క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఆ తర్వాత చికిత్స తీసుకున్న యువరాజ్.. మళ్లీ భారత జట్టులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్ టీమ్లో చోటు దక్కకపోవడంతో 2018లో ఆటకు గుడ్బై చెప్పాడు.