
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించాకే క్రికెట్ గురించి ఆలోచించాలని భారత మాజీ స్టార్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆట కన్నా ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని పేర్కొన్నాడు. మైదానంలో ఉన్నప్పుడు కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితులు ఉండాలని, అలా అయితేనే ప్లేయర్ పూర్తి ఏకాగ్రతతో ఆడగలడని శనివారం ఓచానెల్తో మాట్లాడుతూ తెలిపాడు.
'ముందుగా కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలి. ఈ వైరస్ ఉన్నంతకాలం ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు భయపడతారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆటగాడిపై సహజంగానే కొండంత ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు కరోనా వల్ల వారికి అదనపు ఒత్తిడి కలగకూడదు. ఆడే సమయంలో బంతిపై ఏకాగ్రత తప్ప వేరే ఆలోచనలు ఆటగాడి మదిలోకి రాకూడదనేది నా అభిప్రాయం' అని యూవీ పేర్కొన్నాడు. కరోనా కట్టడికి యువరాజ్ తనవంతు సాయంగా ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
లాక్డౌన్ సమయంలో లైవ్ సెషన్స్లో పాల్గొంటూ యూవీ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్లో తాను సృష్టించిన 6 బంతుల్లో 6 సిక్సర్ల విధ్వంసం వెనుక ఉన్న రహస్యాన్ని తెలిపిన ఈ సిక్సర్ల సింగ్.. ఇటీవల కామెంట్రీ చేయడంపై కూడా పెదవి విప్పాడు. తనకు కామెంటరీ అంటే అంతగా ఇష్టం లేదని, అంతసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండడమంటే తనవల్ల కాదని చెబుతూనే.. కుదిరితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ట్రై చేస్తానంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.
తన సహచర ఆటగాడైన మహ్మద్ కైఫ్తో ఇన్స్టాగ్రాం లైవ్ సెషన్లో మాట్లాడుతూ.. 'కామెంటరీ చేసే ప్రాంతంలో కొందరు వ్యక్తులను నేను ఇష్టపడను. వారితో కలిసి రోజంతా కూర్చుని కామెంటరీ చెప్పడం నావల్ల కాదు. అయితే ఐసీసీ ఈవెంట్లలో కామెంటరీ చెప్పేందుకు నేను ప్రయత్నిస్తా.'అని యువరాజ్ అన్నాడు.