2011 వన్డే ప్రపంచకప్లో క్యాన్సర్తో బాధపడుతూ.. రక్తపు వాంతులు చేసుకుంటూ టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్లు ఎప్పటికీ చిరస్మరణియం. ఆ ఘటనను తాజాగా అతని తండ్రి యోగ్ రాజ్ సింగ్ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దేశం కోసం వన్డే ప్రపంచకప్ ఆడుతూ యువరాజ్ సింగ్ మరణించినా తాను గర్వపడేవాడినని తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'మన దేశానికి ప్రపంచకప్ అందించే క్రమంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్తో మరణించినా ఓ తండ్రిగా నేను గర్వపడేవాడినే. దేశం కోసం నాకొడుకు చేసిన పోరాటం పట్ల నేను ఇప్పటికీ గర్వంగానే ఉన్నా. అతను గ్రౌండ్లో రక్తపు వాంతులు చేసుకున్నప్పటికీ ఆటలో కొనసాగాలనే ఫోన్ చేసి చెప్పాను.

'నువ్వు బాధపడకు. నీకు ఏం కాదు. దేశం కోసం వరల్డ్ కప్ గెలువు.'అని యువీకి చెప్పాను' అని యోగ్రాజ్ పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ ఆల్రౌండర్గా అదరగొట్టాడు. బ్యాటింగ్లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో సహా 362 పరుగులు చేసిన యువరాజ్ సింగ్... బౌలింగ్లో 15 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు.
యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ధోనీ సారథ్యంలోని టీమిండియా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంది. యువరాజ్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ దక్కింది. 2011 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే యువరాజ్ సింగ్కు క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. అయినా టోర్నీలో కొనసాగిన యువరాజ్ సింగ్.. చెన్నై వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో రక్తపు వాంతులు చేసుకున్నాడు. అయినా వెనక్కి తగ్గకుండా శతకం సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ అనంతరం అమెరికా వెళ్లి క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న యువరాజ్ సింగ్.. పూర్తిగా కోలుకొని మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ మునపటిలా సత్తా చాటలేకపోయాడు. పేలవ ఫామ్ కనబర్చినా యువరాజ్ సింగ్కు బీసీసీఐ అండగా నిలిచింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా టీమిండియా ఓటమిపాలైంది. ఆ టోర్నీ అనంతరం అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు తుది జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.