
మాకు మీకు అదే తేడా..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ సెషన్లో పాల్గొన్న ఈ సిక్సర్ల సింగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అప్పటి తరానికి ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఉన్న తేడా చెప్పమని రోహిత్ ప్రశ్నించగా.. క్రమశిక్షణ ఒక్కటేనని యూవీ బదులిచ్చాడు. ‘మాతరానికి ఇప్పటికీ నేను గుర్తించిన తేడా ఏంటంటే.. మా అప్పుడు సీనియర్లంటే మాకు గౌరవం, భయం ఉండేది. అప్పటి సీనియర్ ప్లేయర్లు.. టీమ్లోని జూనియర్స్కు దిశానిర్దేశం చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఐపీఎల్, సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే ఫేమ్ వస్తుండటంతో ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ తప్పుతున్నారు.' అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

ఆ వివాదం జరిగి ఉండేది కాదు..
ఇక తమ తరంలో మీడియా ముందు కూడా చాలా గౌరవంగా నడుచుకునేవాళ్లమని తెలిపాడు. ‘అప్పటి భారత జట్టులో ఓ మంచి సంస్కృతి ఉండేది. మీడియా ముందు ఎలా మాట్లాడాలి..? అభిమానులతో ఎలా వ్యవహరించాలి..? అనేదానిపై జూనియర్లకు సీనియర్ క్రికెటర్లు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే.. అలా చేయకూడదంటూ సున్నితంగా హెచ్చరించేవారు. కానీ.. ఇప్పుడు భారత్ జట్టులో ఆ సంస్కృతి ఏమీ నాకు కనిపించడం లేదు. జూనియర్ క్రికెటర్లు సోషల్ మీడియా, పార్టీ కల్చర్ అంటూ రచ్చ చేస్తున్నారు. కానీ.. అప్పట్లో మేము వీటి గురించి కనీసం ఆలోచించను కూడా లేదు. ఏదైనా తప్పు చేస్తే.. సీనియర్లు కోప్పడతారనే భయం మాకు ఉండేది. రాహుల్- హార్దిక్ వివాదం మా టైమ్లో అసలు జరిగి ఉండేది కాదు'అని యువీ స్పష్టం చేశాడు.

టాక్ షోలో నోరు జారి..
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. పబ్లలో మహిళల్ని తాను చూసే విధానంపై హార్దిక్ నోరుజారగా.. అమ్మాయిలతో శారీరక సంబంధాల గురించి రాహుల్ అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు రావడం.. బీసీసీఐ కొద్దిరోజుల పాటు ఈ క్రికెటర్లపై నిషేధం విధించడం తెలిసిందే.

పంత్ మీడియాకు టార్గెట్ అయ్యాడు..
ఇక లైవ్ సెషన్లో రిషభ్ పంత్ పట్ల మీడియా అత్యుత్సాహం కనబరుస్తుందని రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ‘రిషబ్పంత్తో నేను తరుచుగా మాట్లాడుతుంటా. ప్రతీది అతనికి అర్థమయ్యేలా వివరిస్తాను. పంత్ మీడియా చేతిలో చాలా నిశిత పరిశీలనకు గురయ్యాడు. అతని వయసు కేవలం 22 ఏళ్లే. మీడియా తమ ఉద్యోగం తాము చేస్తున్నామని భావిస్తోంది. కనీసం వారు కథనాలు రాసేముందే ఏం రాస్తున్నామోనని ఓ సారి తమను తాము ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఓ ఐదారుగురు యువ ప్లేయర్లతో నేను రెగ్యూలర్గా మాట్లాడుతుంటా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












