నేను సాయం చేశా.. మరి మీరు?
‘దేశమంతా ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నా. నాతో మీరు కూడా వెలిగిస్తారా? ఈ ప్రత్యేకమైన రోజున పీఎంకేర్స్కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నా. మీరు కూడా వీలైనంత సాయం చేయండి'అని యువరాజ్ ట్వీట్ చేశాడు.

5వేల కుటుంబాలకు భజ్జీ సాయం..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతని సతీమణి గీత బస్రా 5 వేల కుటుంబాలకు బియ్యం అందజేస్తామని ప్రకటించారు. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ రూ.3 కోట్లు, రోహిత్ శర్మ రూ.80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్, గంగూలీ రూ.50 లక్షల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

వారి కోసం దీపాన్ని వెలిగిస్తున్నా..
పారిశుద్ద కార్మికుల కోసం దీపాన్ని వెలిగిస్తున్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా మోదీ పిలుపుకు మద్దతు తెలిపాడు. ‘లక్షలాది మంది పారిశుద్ధ కార్మిక యోధుల నిబద్ధతను గౌరవిస్తూ ఆదివారం రాత్రి దీపాన్ని వెలిగుస్తున్నా. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి వారు నిరంతరం శ్రమిస్తున్నారు. మనల్ని సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి కోసం నేను దీపాన్ని వెలిగిస్తున్నా. మీరు వెలిగించే దీపాలకు కూడా ఓ కారణాన్ని ఎంచుకోండి. అందరూ ఐక్యంగా ఉండండి'అని సచిన్ ట్వీట్ చేశాడు.

సమయం ఆసన్నమైంది..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్నవేళ.. మన ఐక్యత చూపాల్సిన సమయం ఆసన్నమైందని భారత క్రికెటర్లు అభిమానులకు సూచించారు. ‘స్టేడియం శక్తి మొత్తం అభిమానుల్లో ఉంటే.. భారత దేశ శక్తి ప్రజల్లో ఉంటుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలకు మనమంతా ఏకతాటిపై నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. మన వైద్య సిబ్బందికి వెన్నంటే ఉన్నామనే భరోసానిద్దాం. టీమ్ఇండియా రగిలింది మోదీజీ'అని కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా.. ‘కరోనాపై మ్యాచ్ గెలవడం మీదే మన జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల కార్యక్రమంలో పాలుపంచుకొని మీ సంఘీభావాన్ని తెలపండి.'అని రోహిత్శర్మ ట్వీట్ చేశాడు. పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా కూడా తమ మద్దతు ప్రకటించారు.


Click it and Unblock the Notifications
