
న్యూఢిల్లీ: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఈ ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనరే ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 'ప్రతీ ఒక్కరికీ తెలియజేస్తున్నా. నేను యూట్యూబ్ చానల్ను ప్రారంభించాను. నా ఈ యూట్యూబ్ చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి. ప్రతీ వారం నన్ను ఫాలో అవ్వండి' అని వార్నర్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్పై స్పందించిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ డ్యాన్సింగ్ వీడియోలు ఉంటాయని ఆశిస్తున్నట్లు కామెంట్ చేశాడు.
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సందర్భంగా వార్నర్ తన భార్య క్యాండిస్, కూతుర్లతో కలిసి టిక్టాక్ వీడియోలు చేశాడు. ఈ సందర్భంగా పలు భారతీయ సినిమా పాటలకు స్టెప్పులేశాడు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పాటలకు చిందేస్తూ.. డైలాగులు చెబతుూ తెలుగు అభిమానులను మరింత చేరువయ్యాడు. దీంతో వార్నర్ దంపతులు టిక్టాక్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, ఇటీవల భారత్లో టిక్టాక్ యాప్ నిషేధించడంతో అభిమానులు ఆ వీడియోలను మిస్ అవుతున్నారు. ఇక అన్లాక్ ప్రక్రియ మొదలయ్యాక క్రికెట్ తిరిగి ప్రారంభమవ్వగా.. ఇప్పుడు యూఏఈలో ఐపీఎల్ ఆడుతున్న వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
గురువారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 201 పరుగులు చేసింది. వార్నర్ 52 పరుగులు చేయగా, బెయిర్ స్టో 97 పరుగులతో మెరిశాడు.ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ తడబడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక యువీ కోరినట్టు వార్నర్ తన డ్యాన్సింగ్ వీడియోలతో మళ్లీ అలరిస్తాడో లేదో చూడాలి.