తన తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్కు స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఇలా మాట్లాడవద్దని తన తండ్రికి కూడా సూచించినట్లు పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్, కోచ్ అయిన యోగ్రాజ్ సింగ్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించినప్పటికీ, అతని కెప్టెన్సీ రాకుండా ధోనీ అడ్డుకున్నాడని యోగ్రాజ్ సింగ్ పలు ఇంటర్వ్యూల్లో ఆరోపించాడు. అంతేకాకుండా తన కెరీర్ త్వరగా ముగియడానికి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ కారణమని చెప్పాడు. ఆ సమయంలో అతన్ని చంపాలనుకున్నానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్ను తన తండ్రి యోగ్రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు గురించి ప్రశ్నించగా విచారం వ్యక్తం చేశాడు. ఇలా మాట్లాడకుండా తన తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశానని తెలిపాడు. 'నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది సరికాదని మా నాన్నకు కూడా చెప్పాను'అని ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ బదులిచ్చాడు.
1980లో భారత జాతీయ జట్టు నుంచి కపిల్ దేవ్ తనను తప్పించారని, ఆ తర్వాత నార్త్ జోన్, హర్యానా జట్ల నుంచి కూడా తొలగించాడని యోగ్ రాజ్ సింగ్ ఆరోపించాడు. ఆ సమయంలో కపిల్ దేవ్ను చంపాలనుకున్నానని గతేడాది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చండీగఢ్లోని కపిల్ నివాసానికి పిస్టల్తో వెళ్లానని చెప్పుకొచ్చాడు.
'కపిల్ దేవ్ భారత్, నార్త్ జోన్, హర్యానా జట్లకు కెప్టెన్గా ఉన్నప్పుడు నన్ను అకారణంగా జట్టు నుంచి తొలగించాడు. నా భార్య(యువరాజ్ సింగ్ తల్లి) ఈ విషయమై కపిల్ దేవ్ను నిలదీయాలని కోరింది. ఆ వ్యక్తికి బుద్ధి చెబుతానని నేను ఆమెతో అన్నాను. నా పిస్టల్ తీసుకుని సెక్టర్ 9లోని కపిల్ ఇంటికి వెళ్లాను. అతను తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. నేను అతడిని చాలా తిట్టాను. నీ వల్ల నేను ఒక స్నేహితుడిని కోల్పోయానని అరిచాను.
నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అనుభవిస్తావని చెప్పాను. నీ తలలోకి బుల్లెట్ దింపాలనుంది. కానీ నీ పక్కన ఉన్న నీ పుణ్యమూర్తి అయిన తల్లి కోసం వదిలేస్తున్నాను అని చెప్పాను. ఆ క్షణమే నేను క్రికెట్ ఆడకూడదని, యువీని ఆడించాలని నిర్ణయించుకున్నాను'అని యోగరాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
యోగరాజ్ విమర్శలు కేవలం కపిల్ దేవ్కు మాత్రమే పరిమితం కాలేదు. బిషన్ సింగ్ బేడీ, ఎంఎస్ ధోనీ వంటి ఇతర దిగ్గజాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించాడు. 'నేను బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎవరితో అయితే ఉన్నానో వారి గురించి మాట్లాడగలను. వారు ప్రజలను చాలా హీనంగా చూశారు. తప్పు ఎప్పుడూ తప్పే. రెండు తప్పులు కలిసి ఒక ఒప్పిదాన్ని చేయలేవు. మన క్రికెటర్లను, జట్టును మన కెప్టెన్లే నాశనం చేశారు.'అని యోగరాజ్ వ్యాఖ్యానించాడు.