
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(34) ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలను షాక్కు గురి చేసింది. ఇప్పటికే ఈ యువ హీరో మృతి పట్ల సీనీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ అన్టోల్డ్ స్టోరీ'మూవీలో హీరో అయిన సుశాంత్ మృతి పట్ల క్రికెట్ లోకం శోకసంద్రంలో మునిగింది. ఇప్పటికే దిజగ్గ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాలు ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ ఆల్రౌండర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్లు సైతం సుశాంత్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా యువరాజ్ చేసిన ట్వీట్ అభిమానుల మనసులను కలిచివేస్తోంది. డిప్రెషన్లో ఉన్న వారి మానసిక స్థితిని తెలియజేస్తూ సుశాంత్కు యూవీ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించాడు.
'నిజంగా ఈ వార్తను నమ్మలేకపోతున్నా. కొంతమంది యంగ్గానే ఎంతో సాధించినా.. మానసికంగా ఎంతో సంఘర్షణకు లోనవుతుంటారు. అదేంటో మనకు తెలియదు. బయటకి మాత్రం నవ్వుతూ అంతా బాగున్నట్టే కనిపిస్తారు. ఆర్ఐపీ సుశాంత్ సింగ్ రాజ్పుత్'అని యువీ ట్వీట్ చేశాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ కూడా సుశాంత్తో ఉన్న పరిచయాన్ని, కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ మధ్య తాజ్ హోటల్ జిమ్లో కలిసానని, బాయ్.. చిచ్చోర్ మూవీ చూడని కూడా సుశాంత్ చెప్పాడన్నాడు.
'సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వార్త విని షాక్కు గురయ్యా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నా. ఆ మధ్యే తాజ్ హోటల్ జిమ్లో సుషాంత్తో మాట్లాడాను. అతని కేదార్నాథ్ సినిమా గురించి ప్రస్తావిస్తూ అద్భుతంగా నటించావని ప్రశంసించా. దానికి అతను 'బాయ్.. చిచ్చోర్ మూవీ కూడా చూడా నీకు బాగా నచ్చుతుంది'అని చెప్పాడు'అని పఠాన్ ట్వీట్ చేశాడు.
ఇక గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న సుశాంత్ ఆదివారం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. 'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'చిచ్చోర్'. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు.