
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్పై టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ ప్రశంసలు జల్లు కురిపించాడు. అతని సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ తరఫున మూడేళ్ల పాటు ఆడటం తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పుకొచ్చిన యూసఫ్.. అంత కంటే ఎక్కువ ఆడకపోవడం తాను చేసుకున్న దురదృష్టమన్నాడు.
తన ఐపీఎల్ అత్యుత్తమ సారథుల్లో షేన్ వార్న్ ఒకడని చెప్పుకొచ్చాడు. ఎలాంటి అంచానాలు, పెద్ద ఆటగాళ్లు లేని జట్టును ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా విజేతగా నిలపడం వార్న్ ఒక్కడికే సాధ్యమని కొనియాడాడు. ఇక షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ వెటరన్ క్రికెటర్ తాజాగా క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు అడగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు.

'ఐపీఎల్లో షేన్ వార్న్ సారథ్యంలో మూడేళ్లు ఆడాను. అతనితో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. మమ్మల్ని వార్న్ మార్గ నిర్దేశం చేసిన తీరు అమోఘం. బ్యాట్స్మెన్ ఎలా ఔట్ చేయాలనే విషయంలో వార్న్ అనేక ట్రిక్స్ చెప్పేవాడు. మ్యాచ్కు ముందు మేం కొన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని ప్రయోగించేవాళ్లం. దురదృష్టవశాత్తు వార్న్ సారథ్యంలో మూడేళ్లపాటే ఆడాను.
పెద్ద ప్లేయర్లు, ఎలాంటి అంచనాలు లేకుండా అతను జట్టును ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా విజేతగా నిలిపాడు. ఆ సమయంలో జట్టులో డొమెస్టిక్ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. అందుబాటులో ఉన్న కొద్ది పాటి వనురులతో జట్టును విజేతగా నిలపడం అతని కెప్టెన్సీకి అద్దం పడుతుంది'అని యూసఫ్ కొనియాడాడు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ఒక్క పదంలో చెప్పాలని ప్రశ్నించగా... ధోనీ తెలివైన క్రికెటరని( క్లెవర్), యువరాజ్ సింగ్ రాక్ స్టార్ అని యూసఫ్ బదులిచ్చాడు.