
కడప: తెలుగు రాష్ట్రాల్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం ముస్తాబవుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నిర్మించిన వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియానికి అతిత్వరలోనే అంతర్జాతీయ హోదా దక్కనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే రాజా రెడ్డి స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్కు వేదిక కానుంది. ఇప్పటికే ఇక్కడ రంజీ మ్యాచ్లు జరుగుతున్నాయి. పలువురికి క్రికెటర్లకు శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

అయితే డే అండ్ నైట్ మ్యాచ్లు నిర్వహించేందుకు వీలుగా రూ.4 కోట్లతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో పాటు కొన్ని మౌళిక సదుపాయాలను కల్పించడానికి అవసరమైన చర్యలను తీసుకోనున్నారు. మైదానంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పూర్తయితే తెలుగురాష్ట్రాల్లో అంతర్జాతీయ మ్యాచ్లకు మరో స్టేడియం అందుబాటులోకి వచ్చినట్లే. ప్రస్తుతానికైతే హైదరాబాద్, ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియాలు మాత్రమే అంతర్జాతీయ హోదాను కలిగి ఉన్నాయి.
కడప శివార్లలోని పుట్లంపల్లి వద్ద నిర్మించిన స్టేడియం ఇది. సుమారు 80 ఎకరాల్లో ఇది నిర్మితమైంది. 14 ఏళ్ల క్రితం 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.50 లక్షలతో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరిట క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఆధ్వర్యంలో రూ. 10 కోట్లతో 2010లో రాజా రెడ్డి స్టేడియం నిర్మాణం పూర్తయింది.

ముఖ్య మంత్రి వైఎస్ జగన్ రాక సందర్భంగా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్కు స్వాగతం పలుకుతూ మైదానంలోని పచ్చికతో 'వెల్కమ్ జగన్ మోహన్ రెడ్డి'అంటూ అందంగా తీర్చిదిద్దారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి పేరిట ఈ స్టేడియం నిర్మిస్తే.. మనవడు వైఎస్ జగన్ హయాంలోనే ఈ స్టేడియం అంతర్జాతీయ కళను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.