కరాచి: అండర్-19 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 10 వికెట్లతో ఘనవిజయం సాధించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అయితే తమ జట్టు ఓటమిపై స్పందించిన ఆ దేశ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ జట్టుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో బోర్డు విఫలమైందని మండిపడ్డాడు. అసలు యువ ఆటగాళ్ల కోసం ఏం చేయాలో కూడా పీసీబీ అధికారులకు తెలియలేదన్నాడు. ఇక భారత జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడటం తీవ్రంగా బాధించిందని తెలిపాడు.
ప్చ్.. మంధాన మెరిసినా ఓటమి తప్పలేదు
'పాకిస్తాన్ క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పీసీబీకి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. కొత్త తరం ఆటగాళ్లకు భరోసా కల్పిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ సెమీస్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడటం బాధాకరం. ఈ మ్యాచ్లు భారత ఆటగాళ్లు చాలా మెచ్యురిటీని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఆడారు.
'పాకిస్తాన్ యువ క్రికెటర్లు వారి నైపుణ్యాల పెంచుకోవడంపై దృష్టిసారించాలి. ఆత్మవిశ్వాసంతోనే భారత జట్టు విజయం సాధించింది. యువ ఆటగాళ్లకు పీసీబీ మరిన్ని అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా విదేశాల్లో ఆడేలా ప్రణాళికలు రచించాలి.. వారి మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయాలి'అని యూనిస్ ఖాన్ పీసీబీకి సూచించాడు.
ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా పీసీబీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అండర్-19 జట్టుకి ఏ తరహా మెరుగైన శిక్షణ ఇవ్వాలో భారత్ని చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని సూచించాడు.
'భారత అండర్-19 జట్టుకి కోచ్గా రాహుల్ ద్రవిడ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. ఒక గొప్ప ఆటగాడు కోచ్గా ఉండాలంటే.. కచ్చితంగా అతని స్థాయికి తగినట్లు జీతభత్యాలు ఇవ్వాలి. చాలామంది క్రికెటర్లు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి ఇప్పుడు సత్తా చాటుతున్నారు. నాతో పాటు అండర్-19 జట్టుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్ తదితరులు రెడీగా ఉన్నారు. మా కోచింగ్లో జట్టు శిక్షణ పొంది ఉంటే ఈ తరహా పేలవ ప్రదర్శన చేసేదా?' అని అక్తర్ పీసీబీని ప్రశ్నించాడు.