టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్లో పర్యటించాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చిన ఆటగాడిగా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు రావాలని కోరుతూ.. యూనిస్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్లో ఓ బ్యాటర్గా విరాట్ కోహ్లీ ఎన్నో సాధించాడని, పాకిస్థాన్ గడ్డపై ఆడటం ఒక్కటే మిగిలి పోయిందన్నాడు.
ఏడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ టోర్నీ నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నదమవుతోంది. అయితే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాకిస్థాన్లో పర్యటించేది లేదని, తటస్థ వేదికగా తమ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.

హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతోందని పీసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు.. పాకిస్థాన్లో పర్యటించాలని ఆదేశ మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. ఇప్పటికే షాహిద్ అఫ్రిది.. టీమిండియాను స్పెషల్గా రిక్వెస్ట్ చేయగా.. తాజాగా యూనిస్ ఖాన్ ఆ జాబితాలో చేరాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం విరాట్ కోహ్లీ కచ్చితంగా పాకిస్థాన్కు రావాలి. ఇది మా కోరిక కూడా. కోహ్లీ కెరీర్లో మిగిలిపోయిన విషయం ఏదైనా ఉందా? అంటే అది.. పాకిస్థాన్ గడ్డపై ఆడటమే.'అని యూనిస్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంతకుముందు షాహిద్ అఫ్రిది సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. పాకిస్థాన్ అభిమానుల నుంచి లభించే ప్రేమ, ఆదరణను చూసి విరాట్ కోహ్లీ.. భారత్నే మర్చిపోతాడని పేర్కొన్నాడు.

'నేను కూడా టీమిండియాకు ఘనస్వాగతం పలుకుతాను. భారత్లో పాకిస్థాన్ పర్యటించినప్పుడు కూడా మాకు అక్కడి అభిమానుల ప్రేమ, ఆదరణ దక్కింది. 2005-06లో భారత్.. పాక్లో పర్యటించినప్పుడు ఆటగాళ్లంతా ఆ టూర్ను బాగా ఆస్వాదించారు. భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి, సత్సంబంధాలు నెలకొనాలంటే అది క్రికెట్తోనే సాధ్యం.
ఒకవేళ విరాట్ కోహ్లీ పాకిస్థాన్కు వస్తే.. ఇక్కడి అభిమానుల ప్రేమ, ఆదరణ చూసి భారత్లోని సౌకర్యాలను కూడా మర్చిపోతాడు. పాకిస్థాన్లో అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.