టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కారణంగా కుర్రాళ్లను ప్రేరేపించేవారు జట్టులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ కూడా ఇలానే తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పిన యోగ్ రాజ్ సింగ్.. రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ 50 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడాల్సిందని అభిప్రాయపడ్డారు.
జట్టు నాశనం..
'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అతని రిటైర్మెంట్ జట్టుకు తీరని నష్టమే. 2011లోనూ చాలా మంది ఆటగాళ్లు ఇలానే జట్టు నుంచి తప్పుకున్నారు. కొందరు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. మరికొందరు బలవంతంగా ఆటకు వీడ్కోలు పలికారు. ఇంకొందరు జట్టులో చోటు కోల్పోయారు. దాంతో జట్టు పూర్తిగా విచ్చిన్నమైంది. ఇప్పటికీ తిరిగి సెట్ అవ్వలేదు. ఏదో రోజు ప్రతి ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది.

నా కొడుకు యువరాజ్ సింగ్ కూడా రిటైర్మెంట్ విషయంలో ఇలానే తొందరపడ్డాడు. రిటైర్మెంట్ సరికాదని ఆ సమయంలో నేను యువీకి చెప్పాను. నడవలేని స్థితికి చేరుకున్నప్పుడే ఆట నుంచి వైదొలగాలి. జట్టు మొత్తం యువకులతో నిండి ఉంటే ఆశించిన ఫలితాలు దక్కవు. అయితే కోహ్లీ తన కెరీర్లో సాధించడానికి ఏమి మిగిలి లేదని భావించి ఉండవచ్చు.
50 ఏళ్ల వరకు ఆడాల్సింది..
రోహిత్ శర్మకు ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు లేపి రన్నింగ్ చేయమని చెప్పే ఓ వ్యక్తి ఉండాల్సింది. రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ చాలా త్వరగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ గొప్ప ఆటగాళ్లు 50 ఏళ్ల వయసు వరకు ఆడాల్సింది. వారి రిటైర్మెంట్ నన్ను ఎంతో బాధకు గురి చేసింది. ఎందుకుంటే ఇప్పుడు జట్టులోని యువకులను ప్రేరేపించే వ్యక్తులు లేకుండా పోయారు.'అని యోగ్రాజ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు.
షాక్లో క్రికెట్ ప్రపంచం..
ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారం వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సెలెక్టర్ల సూచనలతో రోహిత్ శర్మ వీడ్కోలు పలకడాని ప్రచారం జరిగింది. కానీ కోహ్లీ రిటైర్మెంట్ అందర్నీ అసంతృప్తికి గురి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీ.. మరో రెండేళ్ల వరకైనా ఆడుతారని అంతా అనుకున్నారు. 10 వేల టెస్ట్ పరుగుల లక్ష్యాన్ని అందుకోకుండానే కోహ్లీ ఆట నుంచి తప్పుకున్నాడు.