న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ స్వార్థపరుడని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మరోసారి మండిపడ్డాడు. గతంలో ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన యోగ్రాజ్.. తాజాగా ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి ధోనీనే కారణమని ఆరోపించిన యోగ్ రాజ్ సింగ్.. కోహ్లీ కెప్టెన్సీలో భారీ కుట్ర చేశాడని తెలిపాడు.
తాను తప్పా టీమిండియా తరఫున మరొకరు ప్రపంచకప్ గెలవద్దనే దురాలోచనతో కావాలనే రనౌటయ్యాడని ఆరోపించాడు. ఈ మేరకు తన ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. 'ఇప్పటికీ నా రక్తం మరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోనీ ఉద్దేశపూర్వకంగానే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు.

భారత్ తరఫున మరో కెప్టెన్ ప్రపంచకప్ గెలవాలని అతను అనుకోలేదు. ఓవైపు రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చినా ధోనీ అతనికి సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్తో అతనిపై ఒత్తిడిపెంచి ఔటయ్యేలా చేశాడు. తన సామర్థ్యానికి తగ్గట్లు ఆడకుండా కావాలనే రనౌటయ్యాడు. అతని సామర్థ్యంలో కనీసం 40 శాతం ఉపయోగించినా భారత జట్టు 48వ ఓవర్లోనే విజయం సాధించేది. 'అని యోగ్రాజ్ చెప్పుకొచ్చాడు.
భారత విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ అనూహ్యంగా రనౌటయ్యాడు. మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా వికెట్లకు తాకడంతో అర ఇంచు తేడాలో ధోనీ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. దాంతో ఆ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. గ్రూప్ స్టేజ్ టాపర్గా నిలిచినా.. ఫైనల్ చేరలేకపోయింది.
ధోనీ కెరీర్లో అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. 2020 ఆగస్టు 15న తన కెరీర్కు వీడ్కోలు పలికాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ చివరి ఇన్నింగ్స్కు నిన్నటితో నాలుగేళ్లు పూర్తవ్వగా.. యోగ్రాజ్ ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ధోనీ వల్లే యువరాజ్ సింగ్ కెరీర్ త్వరగా ముగిసిందని, రెండు ప్రపంచకప్ల్లో కీలక పాత్ర పోషించినా రావాల్సిన గుర్తింపు రాలేదని, క్రెడిట్ అంతా ధోనీకే దక్కిందని యోగ్ రాజ్కు కోపం ఉంది.
చాలా సందర్భాల్లో ధోనీని యోగ్ రాజ్ ఘాటుగా విమర్శించాడు. ఇక యువరాజ్ సింగ్ తల్లితో యోగ్రాజ్ విడిపోయాడు. ప్రస్తుతం అతను ఒంటరిగానే ఉంటున్నాడు.