టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సక్సెస్ క్రెడిట్ తన కొడుకు యువరాజ్ సింగ్దేనని మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ అన్నాడు. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్మన్ గిల్ను నయా కెప్టెన్గా ఎంపిక చేసింది. టీమిండియా 37వ టెస్ట్ సారథిగా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. శుభ్మన్ గిల్కు అభినందనలు తెలియజేసిన యోగ్రాజ్ సింగ్.. అతని సక్సెస్ క్రెడిట్ యువరాజ్ సింగ్తో పాటు గిల్ తండ్రిదని చెప్పాడు.
'శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శన క్రెడిట్ అతని తండ్రితో పాటు యువరాజ్ సింగ్ది. ఈ రోజు శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడన్నా.. అతను సుదీర్ఘ కాలం సారథిగా కొనసాగినా.. అందులో యువరాజ్ సింగ్ గైడెన్స్ కీలక పాత్ర పోషించింది. పోషిస్తుంది.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

శుభ్మన్ గిల్ తన తండ్రి పర్యవేక్షణలో క్రికెట్ ఓనమాలు నేర్చుకొని సూపర్ స్టార్గా ఎదిగాడు. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో యువరాజ్ సింగ్ వద్ద గిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. శుభ్మన్ గిల్ 32 టెస్ట్ మ్యాచ్లు ఆడి 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే రెడ్ బాల్ క్రికెట్లో శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ చేసిన అనుభవం పెద్దగా లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఐదు సందర్భాల్లో మాత్రమే కెప్టెన్సీ చేశాడు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ పర్యటనలో తన కెప్టెన్సీ కెరీర్ను ప్రారంభించనున్నాడు.
ఐపీఎల్లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ను నడిపిస్తున్న శుభ్మన్ గిల్.. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో శుభ్మన్ గిల్కు రిషభ్ పంత్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కావడంతో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలవ్వనుంది.