భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మరో స్టార్ రెజ్లర్, బీజేపీ నేత యోగేశ్వర్ దత్ డిమాండ్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అనర్హత విషయంలో ఆమె దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్లో బరువు పెరిగితే అనర్హత వేటుకు గురవుతారనే విషయం వినేష్ ఫోగట్కు తెలియదా? అని ప్రశ్నించారు.
బరువు పెరగడం ఆమె తప్పేనని, దీన్ని కుట్రగా అభివర్ణించడం సరికాదన్నారు. ఆమె స్థానంలో తాను ఉంటే ఎప్పుడో దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పేవాడినని తెలిపారు. గతేడాదిగా ఆమె చేపట్టిన నిరసన కార్యక్రమాలు, కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలో నిర్వహించిన మార్చ్లు కాంగ్రెస్ ప్లాన్లో భాగంగానే చేశారని విమర్శించారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించిన వినేష్ ఫోగట్.. చివరి నిమిషంలో అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు. తుది పోరుకు అర్హత సాధించిన తనకు రజత పతకమైనా ఇవ్వాలని ఆమె చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు.
ఒలింపిక్ మెడల్ సాధించాలనే కల చెదరడంతో ఆమె రెజ్లింగ్కు వీడ్కోలు పలికి కాంగ్రెస్లో చేరారు. హరియాణాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి యోగేశ్ బైరాగి పోటీ చేస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ కవితా దలాల్ను నిలబెట్టింది. దాంతో ఈ ఎన్నికల్లో జులానా నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది.