కివీస్ చేతిలో క్లీన్ స్వీప్..
ఈ ఏడాది న్యూజిలాండ్ సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన భారత్.. అక్కడ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడింది. కానీ ఆ రెండు మ్యాచ్ల్లోనూ ఓడి సిరీస్ను 0-2 చేజార్చుకుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. పేలవ బ్యాటింగ్తో మ్యాచ్ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 165 పరుగులకే ఆలౌటవ్వగా.. కివీస్ 348 రన్స్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 191 పరగులకే పరిమితై చిత్తుగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో విరాట్ కోహ్లీ(2, 19)దారుణంగా విఫలమయ్యాడు.
ఆధిపత్యం చెలాయించి..
ఇక రెండో టెస్ట్లో ఆధిపత్యం కనబర్చిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్లో అనూహ్యంగా తడబడి 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పృథ్వీషా(54), చతేశ్వర్ పుజారా(54), హనుమ విహారీ(55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 242 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం కివీస్ 235 రన్స్కే ఆలౌట్ చేసి 7 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆతిథ్య బౌలర్ల ధాటికి 124 పరగులకే కుప్పకూలి గెలిచి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో విరాట్(3, 14) దారుణంగా విఫలమయ్యాడు.
36/9 పరుగులకే పరిమితమై..
న్యూజిలాండ్ పర్యటన తర్వాత కరోనాతో 9 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. ఐపీఎల్తో భారత క్రికెట్ షురూ అయినా.. అంతర్జాతీయ క్రికెట్ మాత్రం ఆసీస్తోనే మొదలైంది. ఈ టూర్లో వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయిన భారత్ మూడు టీ20ల సిరీస్ను 1-2తో గెలిచి లెక్క సరిచేసింది. అదే ఉత్సాహంతో టెస్ట్ సిరీస్ను ప్రారంభించిన భారత్కు ఊహించని షాక్ తగిలింది.
అడిలైడ్ వేదికగా రెండున్నర రోజుల్లో ముగిసిన డే/నైట్ టెస్ట్లో 8 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో రెండు రోజులు ఆసీస్పై ఆధిపత్యం కనబర్చిన భారత్.. ఒక్క సెషన్లో పేలవ బ్యాటింగ్తో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్మన్తో కూడిన జట్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే పరిమితమై పరువు తీసుకుంది. 96 ఏళ్ల భారత టెస్ట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరంటే.. కోహ్లీసేన ఎంత దారుణంగా ఆడిందో అర్థమవుతోంది.
మెల్బోర్న్లో మెరిసింది..
ఇక అడిలైడ్ ఘోర పరాజయం, కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ, మహ్మద్ షమీ గాయంతో దూరమవ్వడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రెండో టెస్ట్ ఆడిన భారత్.. అజింక్యా రహానే సూపర్ కెప్టెన్సీతో అదిరే విజయాన్నందుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆసీస్పై ఆధిపత్యం కనబర్చి అడిలైడ్ పరాజయానికి పర్ఫెక్ట్ రివేంజ్ తీసుకుంది. టాస్ కలిసి రాకున్నా.. అద్బుత బౌలింగ్తో ఆసీస్ను 195 పరుగులకే పరిమితం చేసింది.
ఆ తర్వాత రహానే సూపర్ సెంచరీతో 326 రన్స్ చేసి 131 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 200 పరుగులకే పరిమితం చేసి 70 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది.