
కోబీ బ్రయాంట్ ..
అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. చాంపియన్ ప్లేయర్... ఒలింపిక్స్ గోల్డెన్ స్టార్... ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయితే బ్రయాంట్ ఈ ఏడాది జనవరి 26న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అతనితో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. జనవరిలో క్రీడాలోకాన్ని కన్నీట ముంచిన ఈ పిడుగులాంటి వార్తపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

డీగో మారడోనా..
ఫుట్బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. ఈ ఏడాది నవంబర్ 25న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వరల్డ్కప్ విజేత అయిన మారడోనాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 60ఏళ్ల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. కానీ అంతలోనే గుండె పోటుకు గురై శాశ్వత సెలవు తీసుకున్నారు. అలనాటి ఫుట్బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు.

బల్బీర్ సింగ్
హాకీ లెజెండ్, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బల్బీర్ సింగ్ సీనియర్ ఈ ఏడాది మే 25న కన్నుమూశారు. మొదడులో రక్తం గడ్డకట్టడం సహా తీవ్ర అనారోగ్యానికి గురై 95 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. 1948 లండన్, 1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత్ పసిడి పతకాలు సాధించడంలో బల్బీర్దే కీలకపాత్ర. 1956 విశ్వక్రీడల్లో సారథిగా భారత్ను విజేతగా నిలిపారు. ఒలింపిక్ ఫైనల్స్(1952)లో అత్యధిక గోల్స్(5) చేసిన ఆటగాడిగా రికార్డు ఆయన పేరిటే ఉంది. ధ్యాన్చంద్తో సమానంగా హాకీ దిగ్గజంగా పేరొందిన బల్బీర్ సింగ్ మృతితో క్రీడాలోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన క్రీడాకారుడు బల్బీర్ సింగే.

చేతన్ చౌహాన్
కరోనా మహమ్మారి బారిన పడి భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆగస్టు 16న మృతి చెందారు. కరోనా వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్న ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు బీపీ సమస్యలతో బాధపడ్డారు. దాంతో ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచినా పరిస్థితి చేయిదాటి పోయింది. దూకుడైన ఓపెనర్గా పేరొందిన చౌహాన్ భారత్ తరఫున 1969 - 1978 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు ఆడి 2084 పరుగులు చేశారు.
ఏడు వన్డేల్లో బరిలోకి దిగారు. ఆపై రాజకీయాల్లోనూ ప్రవేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుండగానే తుదిశ్వాస విడిచారు.

డీన్ జోన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ హఠాన్మరణం క్రీడాప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఐపీఎల్ కామెంట్రీ విధుల్లో ముంబైలో ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 24న ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడిన ఆయన 46.55 సగటు, 11 సెంచరీలతో 3631 రన్స్ చేశాడు. 164 వన్డేల్లో 6068 పరుగులు చేసిన జోన్స్.. ఏడు సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. క్రికెట్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ఆయన ప్రొఫెసర్ డీనోగా ఫేమస్ అయ్యారు.


Click it and Unblock the Notifications












