
కివీస్ చేతిలో క్లీన్ స్వీప్..
ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 5 టీ20ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి శుభారంభం అందుకుంది. కానీ ఆ వెంటనే మూడు వన్డేల సిరీస్ను 0-3తో, రెండు టెస్ట్ల సిరీస్ 0-2తో ఓడి కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఈ ఘోర పరాజయాలు భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం టీమిండియా విజయాలపై ప్రభావం చూపింది. టీ20 సిరీస్లో కనబర్చిన జోరును కోహ్లీసేన మిగతా సిరీస్ల్లో కొనసాగించలేక సమష్టిగా విఫలమైంది. విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్ బుమ్రా కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరి వైఫల్యం భారత అభిమానులు తీవ్రంగా బాధించింది.

ధోనీ, రైనా రిటైర్మెంట్..
కివీస్ పర్యటన అనంతరం సౌతాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ కరోనా పుణ్యమా రద్దవ్వగా.. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 5 నెలల సుదీర్ఘ విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించారు. ఇక కరోనా ప్రభావం తగ్గి ఐపీఎల్ 2020 సీజన్కు లైన్ క్లియర్ అవ్వగా.. ఆ సంతోషంలో ఉన్న అభిమానులకు మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా గట్టి షాకిచ్చారు. ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతర్జాతీయగా క్రికెట్కు గుడ్బై చెప్పారు. తొలుత ఇన్స్టా వేదికగా 'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ధోనీ షేర్ చేయగా.. ఆ వెంటనే మహీ అడుగుజాడల్లోనే నడుస్తానని రైనా ఆటకు అల్విదా ప్రకటించాడు. ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడి ఘనంగా వీడ్కోలు పలుకుతాడనుకున్న అభిమానులకు నిరాశనే మిగిలింది. మహీ ఆకస్మిక నిర్ణయంతో ఎందరో అభిమానుల మనస్సులు నొచ్చుకున్నాయి.

చేతన్ చౌహన్, డీ జోన్ మరణం..
కరోనా మహమ్మారి బారిన పడి భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ప్రాణాలు కోల్పోగా.. ఐపీఎల్ 2020 సీజన్ టీవీ వ్యాఖ్యనం కోసం భారత్కు వచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో మరణించాడు. ఈ ఇద్దరి అకాల మరణం క్రికెట్ అభిమానులను శోకసంధ్రంలో ముంచింది. 73 ఏళ్ల చేతన్ చౌహాన్ తన కెరీర్ లో 40 టెస్టు మ్యాచ్లు ఆడాడు. సునీల్ గవాస్కర్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగేవాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆపై రాజకీయాల్లోనూ ప్రవేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఇక డీన్ జోన్స్ ముంబైలోని ఓ హెటల్లో గుండెపోటుతో మరణించారు. ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడిన ఆయన 46.55 సగటు, 11 సెంచరీలతో 3631 రన్స్ చేశాడు. 164 వన్డేల్లో 6068 పరుగులు చేసిన జోన్స్.. ఏడు సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక డీన్ జోన్స్ అకాల మరణంపై యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

36 పరుగులకే ఆలౌట్..
ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కోహ్లీ సేన వన్డే సిరీస్ కోల్పోయినా టీ20 సిరీస్ నెగ్గి బదులు తీర్చుకుంది. కానీ టెస్ట్ సిరీస్లో దారుణ ఓటమితో పరువు తీసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే పరిమితమవ్వడాన్ని ఎవరూ జీర్ణీంచుకోలేకపోతున్నారు. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోర్ చేసిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ చెత్త రికార్డు అభిమానులకు తీవ్రని మనోవేదనను మిగిల్చింది. గత పర్యటనలో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీసేన.. ఈ పర్యటనలో దారుణ ఓటమితో అది మరుగున పడేలా చేసుకుంది.


Click it and Unblock the Notifications












