2024 చాలా మంది భారత అనామక క్రికెటర్లలో వెలుగులు నింపింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. దాంతో ఈ ఏడాది వారి జీవితాల్లోనే మర్చిపోలేని సంవత్సరంగా నిలిచిపోయింది. ప్రతీ ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొంతమంది కుర్రాళ్ల జీవితాలను మార్చేస్తోంది. ఈ ఏడాది నవంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం కూడా అనామక ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది.
కలలో కూడా ఊహించిన డబ్బును అందించబోతుంది. దాంతో వారి జీవితాలే పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఏడాది కోటీశ్వరులైన అనామక ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

పేస్ సంచలన రసీక్ సలాం
ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చివర్లో బరిలోకి దిగిన రసీక్ సలాం.. తన పేస్ బౌలింగ్తో దుమ్మురేపాడు. ఇటీవలే ముగిసిన ఎమర్జింగ్ ఆసియాకప్లోనూ సత్తా చాటాడు. దాంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు ఆర్సీబీ రూ. 6 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. జమ్ము కశ్మీర్కు చెందిన ఈ యువ పేసర్.. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆర్సీబీ తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తే త్వరగానే జట్టులోకి వస్తాడు.
అల్లా గజన్ఫర్.. రూ. 4.8 కోట్లు
అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ కోసం ముంబై ఇండియన్స్ రూ. 4.8 కోట్లు ఖర్చు చేసింది. అతన్ని అంత ధర పెట్టి ముంబై కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కుర్రాళ్లపై ముంబై భారీ డబ్బు పెట్టిందంటే వారికి మంచి సత్తా ఉందనే అర్థం. అల్లా గజన్ఫర్.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో సత్తా చాటాడు. దాంతో అతనిపై ఫ్రాంచైజీల కన్ను పడింది. చివరికి అతన్ని ముంబై సొంతం చేసుకుంది. అతన్ని మరో రషీద్ ఖాన్లా మార్చాలనే ప్రయత్నంలో ముంబై ఉన్నట్లు అర్థమవుతోంది.
అశుతోష్ శర్మ..రూ. 3.8 కోట్లు!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అనామక బ్యాటర్ అషుతోష్ శర్మ పంట పండింది. ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అషుతోష్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. ఓ మ్యాచ్లో 61 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. మరికొన్ని మ్యాచ్ల్లోనూ జట్టును విజయం ముంగిటకు తీసుకెళ్లాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడి 167 స్ట్రైక్రేట్తో 189 పరుగులు చేశాడు. ఆ ప్రదర్శనే అతనిపై కనక వర్షం కురిపించింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 3.8 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
ప్రియాంశ్ ఆర్య.. రూ. 3.8 కోట్లు..
ఏ స్థాయి క్రికెట్లో అయినా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదడం గొప్ప రికార్డ్. ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ప్రియాంశ్ ఆర్చ ఒకే ఓవర్లో 6 సిక్స్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. బిగ్ హిట్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో మెగా వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 3.8 కోట్లకు ప్రియాంశ్ ఆర్యను దక్కించుకుంది.
గుర్జన్ప్రీత్ సింగ్.. రూ. 2.2 కోట్లు
పంజాబ్కు చెందిన గుర్జన్ ప్రీత్ సింగ్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. పంజాబ్కు చెందిన గుర్జన్ ప్రీత్ సింగ్.. దేశవాళీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అశ్విన్ సారథ్యంలోని దిండిగల్ జట్టు కప్ గెలవడంలో గుర్జన్ ప్రీత్ సింగ్ది కీలక పాత్ర. లెఫ్టార్మ్ పేసర్ అయిన గుర్జన్ప్రీత్ సింగ్.. గతంలో చెన్నైకి నెట్బౌలర్గా సేవలందించాడు. దాంతో అతన్ని ఆ జట్టు కొనుగోలు చేసింది.
భారీ ధర పలికిన మరికొంత మంది ఆటగాళ్లు..
నెహాల్ వదేరా -రూ. 4.20 కోట్లు (పంజాబ్ కింగ్స్)
అభినవ్ మనోహర్ - 3.20 కోట్లు( సన్రైజర్స్ హైదరాబాద్)
విజయకుమార్ వైశాఖ్ - 1.80 కోట్లు (పంజాబ్ కింగ్స్)
వైభవ్ అరోరా - 1.80 (పంజాబ్ కింగ్స్)
యశ్ ఠాకూర్ 1.60 కోట్లు (పంజాబ్ కింగ్స్)
సుయాష్ శర్మ - 2.60 కోట్లు (ఆర్సీబీ)
అన్షుల్ కాంబోజ్ - 3.40 కోట్లు(సీఎస్కే)