ఆట అంటేనే యుద్ధం! ఈ యుద్ధంలో విజయం ఒక భాగమైతే.. వివాదం దాని వెన్నంటే వచ్చే నీడ! ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు.. ఉత్కంఠభరిత విజయాలనే కాకుండా అంతకుమించి మైదానంలో మంటలు రాజేసిన ఎన్నో వివాదాస్పద ఘటనలను అందించింది. సరిహద్దుల రాజకీయాలు ఆటలో భాగమయ్యాయి. క్రికెటర్ల నోటి దురుసు మైదానం దాటి రచ్చ చేసింది.
ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాదం నుంచి సౌతాఫ్రికా హెడ్ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యల వరకు వివాదాలు ఈ ఏడాది క్రికెట్ను ఊపేసాయి. రఫెల్ విమానాలను కూల్చేసామనే సైగలు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ ఏడాది క్రికెట్కు మాయని మచ్చగా మిగిలిపోయిన ఘటనల గురించి తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడవద్దనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్థాన్తో ఆడిన భారత్.. ఆ జట్టుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ ఘటనను అవమానంగా భావించిన పీసీబీ.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని యూఏఈతో మ్యాచ్కు ముందు బెదిరింపులకు దిగింది. చివరకు మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పడంతో వెనక్కి తగ్గింది. విజయానంతరం సూర్య కుమార్ యాదవ్ భారత సాయుధ బలగాలకు అంకితమివ్వడం కూడా వివాదస్పదమైంది. ఐసీసీ రూల్స్కు ఇది విరుద్దం కావడంతో అతని మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు.

ఆసియా కప్ సందర్భంగానే పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్, ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన సైగలు భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ప్రయోగించిన 6 యుద్ద విమానాలను కూల్చేసామని హ్యారీస్ రౌఫ్ సైగలు చేయగా.. సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ అనంతరం తుపాకీ ఎక్కిపెట్టినట్లు సంబరాలు చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తూ కఠిన చర్యలు తీసుకుంది.
ఆసియా కప్ ట్రోఫీ 2025ని విజేతగా నిలిచిన భారత్ ఇవ్వకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఎత్తుకెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏసీసీ ఛైర్మన్ హోదాలో టైటిల్ ఇచ్చేందుకు మోహ్సిన్ నఖ్వీ సిద్దం కాగా.. భారత్ నిరాకరించింది. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోలేమని చెప్పింది. దాంతో అతను టైటిల్ ఎత్తుకెళ్లగా.. భారత్ ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టైటిల్ భారత్కు అందలేదు. ఈ ఘటనపై బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన రెండు టెస్ట్ల సిరీస్లోనూ వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను భారత ఆటగాళ్లు పంత్, బుమ్రా పొట్టోడా అని సంబోధించడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలను బవుమా పట్టించుకోకపోయినా.. బుమ్రా క్షమాపణలు చెప్పాడు. రెండో టెస్ట్ సందర్భంగా సౌతాఫ్రికా హెడ్ కోచ్ కొన్రాడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో త్వరగా డిక్లెర్ చేయకపోవడానికి కారణం చెబుతూ కొన్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లు మమ్మల్ని ప్రాధేయపడేలా చేయాలనుకున్నామని తెలిపాడు. ఈ క్రమంలో అతను అత్యంత వివాదాస్పదమైన Grovel అనే పదాన్ని ఉపయోగించాడు. గ్రోవెల్ అనే పదం ఒకప్పుడు జాత్యహంకారానికి ప్రతీకగా ఉండేది. అతని వ్యాఖ్యలపై భారత మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా క్రికెట్కు భారత్ చేసిన మేలును మర్చిపోయారా? అని మండిపడ్డారు.