ఈ ఏడాది టీమిండియాకు మిశ్రమంగా సాగింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయం ఆనందంలో ముంచెత్తితే.. కొన్ని ఓటములు పీడకలగా మిగిలిపోయాయి. క్రికెట్ చరిత్రలోనే ఎరగని పరాజయాలు టీమిండియా ప్రతిష్టను దిగజార్చాయి. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అవ్వడం భారత జట్టుతో పాటు అభిమానులకు తీవ్ర బాధను కలిగించింది.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం బంగ్లాదేశ్తో సొంతగడ్డపై జరిగిన 2 టెస్ట్ల సిరీస్ను గెలిచిన టీమిండియా.. అదే జోరులో న్యూజిలాండ్ను చిత్తు చేస్తుందని అంతా భావించారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా శ్రీలంక చేతిలో చిత్తయ్యి భారత్లో అడుగుపెట్టింది. దాంతో భారత్ సునాయసంగా గెలుస్తుందని అంచనా వేసారు. కానీ బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనే న్యూజిలాండ్.. భారత్ను 46 పరుగులకే ఆలౌట్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది.

ఇదే ఆధిపత్యాన్ని చెలాయించి సంచలన విజయాన్నందుకుంది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్లో స్పిన్ వికెట్తో దెబ్బతీయాలనుకున్న టీమిండియా వ్యూహం బ్యాక్ ఫైర్ అయ్యింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లతో సత్తా చాటడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే న్యూజిలాండ్ భారత గడ్డపై తొలి సిరీస్ విజయాన్నందుకుంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్లోనూ భారత్ తేలిపోయింది. మరోసారి స్పిన్ వికెట్ను రెడీ చేసి మూల్యం చెల్లించుకుంది. దాంతో క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై ముడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది.
ఈ సిరీస్కు ముందు శ్రీలంక పర్యటనలో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా కోల్పోయింది. 1997 తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ చేజార్చుకుంది. ఈ సిరీస్లోనూ స్పిన్ బౌలింగ్కే టీమిండియా తడబడింది. శ్రీలంక బౌలర్లు దునిత్ వెల్లలేగే, జెఫ్రీ వాండర్సే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ రెండు సిరీస్ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. దాంతో భారత్కు ఘోర పరాజయాలు తప్పలేదు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ రెండు సిరీస్ పరాజయాలు పీడకలగా మిగిలిపోయాయి.