టీ20 క్రికెట్లో టీమిండియాకు ఈ ఏడాది మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. 17 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాదే తెరపడింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచింది. ఈ విజయంతో అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 విజయం తర్వాత మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ప్రతీ ఐసీసీ టోర్నీల్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది.

17 ఏళ్ల నిరీక్షణకు తెర..
2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన భారత్.. 2015 వన్డే ప్రపంచకప్లో సెమీస్లోనే వెనుదిరిగింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్నది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2021 టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలోనే వెనుదిరిగిన భారత్.. 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లో ఓటమిపాలైంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఖంగుతిన్నది.
2024 టీ20 ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వటైటిల్ను ముద్దాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 76) అసాధారణ బ్యాటింగ్.. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్.. జస్ప్రీత్ బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్ భారత్ను విజేతగా నిలబెట్టాయి.
ఈ విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.
టీమిండియా విజయం 100 శాతం..
ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. ఈ ఏడాది జరిగిన టీ20 సిరీస్ల్లో టీమిండియా అన్నీ గెలిచింది. జనవరిలో అఫ్గానిస్థాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను 3-0తో గెలుచుకున్న టీమిండియా.. జూన్లో జరిగిన టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.
ఆ తర్వాత జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ను 4-1తో గెలుచుకున్న భారత్, శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అక్టోబర్లో బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్, సౌతాఫ్రికా గడ్డపై నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.