ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023తో పాటు ఇతర సిరీస్ల్లో పలువురు క్రికెటర్లు సత్తా చాటారు. కొందరు బ్యాట్తో రికార్డుల మోత మోగించగా.. మరికొంతమంది బాల్తో అదరగొట్టారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఉన్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.
1. విరాట్ కోహ్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చేంది. ఐసీసీ టైటిల్ అందుకోలేదన్న బాధ మినహా వ్యక్తిగతంగా కోహ్లీకి ఈ ఏడాది తిరుగులేదు. ఒకప్పటి కోహ్లీలా విరాట్ పరుగుల మోత మోగించాడు.

ఈ ఏడాది వన్డేలు, టెస్ట్లు మాత్రమే ఆడిన కోహ్లీ.. ఇప్పటివరకు 34 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. 34 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 8 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో పాటు 66.68 సగటుతో 1,934 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

2. ట్రావిస్ హెడ్: వన్డే ప్రపంచకప్ హీరోగా యావత్ క్రికెట్ ప్రపంచ మన్ననలు పొందిన ట్రావిస్ హెడ్.. ఈ ఏడాది 30 మ్యాచ్లు ఆడాడు. మూడు సెంచరీలతో పాటు 9 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ట్రావిస్ హెడ్ 45.43 సగటుతో 1681 రన్స్ చేశాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీతో చెలరేగి ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లోనూ ట్రావిస్ హెడ్ అదరగొట్టాడు.

3. శుభ్మన్ గిల్: ఈ ఏడాది ఇప్పటి వరకు 47 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్ 48.32 సగటుతో 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 2123 రన్స్ చేశాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

4. రోహిత్ శర్మ: ఈ ఏడాది వన్డేలు, టెస్ట్లకు మాత్రమే పరిమితమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పటివరకు 34 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. 51.28 సగటుతో 1,795 పరుగులు చేశాడు, 37 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

5. మహమ్మద్ షమీ: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ ఏడాది సంచలన ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 23 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 56 వికెట్లతో సత్తా చాటాడు. 7/57 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 24 వికెట్లతో ప్రపంచకప్ ఎక్కువ వికెట్లు తీసుకున్న బెస్ట్ బౌలర్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు.

6. పాట్ కమిన్స్: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఈ ఏడాది తిరుగు లేకుండా పోయింది. యాషెస్ సిరీస్ విజయంతో మొదలైన అతని జైత్రయాత్న వన్డే ప్రపంచకప్ విజయం వరకు కొనసాగింది. కెప్టెన్గా యాషెస్ సిరీస్తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టైటిళ్లను ప్యాట్ కమిన్స్ ముద్దాడాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 23 మ్యాచ్లు ఆడిన అతను 49 వికెట్లు తీశాడు. వీటిలో 32 వికెట్లు టెస్టుల్లో కాగా, 17 వన్డేల్లో తీసుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 20.50 కోట్ల భారీ ధర పలికాడు.