వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ టీమ్స్ అన్నీ ఎక్కువగా 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్లే ఆడాయి. టీమిండియా అయితే ఏకంగా 35 వన్డేలు ఆడింది. ఇందులో 27 విజయాలు నమోదు చేసింది. 8 ద్వైపాక్షిక సిరీస్ల్లో ఏడు గెలిచింది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లోనూ వరుసగా 10 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది.
కీలక పోరులో మాత్రం ఆసీస్ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ ఒక్క పరాజయం మినహా ఈ ఏడాది టీమిండియాకు తిరుగులేదు.

ఇక వన్డే క్రికెట్లో అత్యధిక డబ్బులు ఆర్జించిన భారత ఆటగాళ్ల జాబితాలో ఈ సారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చోటు దక్కించుకోలేకపోయారు. బీసీసీఐ అధికారిక లెక్కల ప్రకారం ఒక్క వన్డేకు రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు. వార్షిక కాంట్రాక్ట్లో వచ్చే డబ్బుకు అదనంగా మ్యాచ్ ఫీజులు ఇస్తారు.
ఈ మ్యాచ్ ఫీజుల లెక్క ప్రకారం ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు. అతను ఈ ఏడాది 30 మ్యాచ్లు ఆడి రూ. కోటి 80 లక్షల మ్యాచ్ ఫీజును ఆర్జించాడు. ఈ 30 మ్యాచ్ల్లో 49 వికెట్లు పడగొట్టి ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
కుల్దీప్ యాదవ్ తర్వాత శుభ్మన్గిల్ 29 వన్డేలు ఆడి రూ. 1.74 కోట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 27 మ్యాచ్లు ఆడి రూ. 1.62 కోట్లు మ్యాచ్ ఫీజులుగా ఆర్జించారు.
వన్డేల్లో ఈ ఏడాది అత్యధికంగా మ్యాచ్ ఫీజు తీసుకున్న టాప్-10 భారత ఆటగాళ్లు
1. కుల్దీప్ యాదవ్- రూ. 1.8 కోట్లు
2. శుభ్మన్ గిల్- రూ. 1.74 కోట్లు
3. రోహిత్ శర్మ- రూ. 1.62 కోట్లు
4. విరాట్ కోహ్లీ- రూ. 1.62 కోట్లు
5. కేఎల్ రాహుల్- రూ. 1.62 కోట్లు
6.రవీంద్ర జడేజా- రూ. 1.56 కోట్లు
7. మహమ్మద్ సిరాజ్- రూ. 1.5 కోట్లు
8. సూర్యకుమార్ యాదవ్- రూ. 1.26 కోట్లు
9. శ్రేయస్ అయ్యర్-రూ. 1.20 కోట్లు
10. హార్దిక్ పాండ్యా-రూ. 1.20 కోట్లు