ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. అతను పట్టిందల్లా బంగారమే అయ్యింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో ఓటమి ఎదురైనా.. ఐసీసీ కీలక టోర్నీల్లో మాత్రం ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా అద్భుత విజయాలను అందుకుంది. డబ్ల్యూటీసీ టైటిల్తో పాటు వన్డే ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. యాషెస్ సిరీస్ను రిటైన్ చేసుకున్నాడు.
తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలోనూ అతనిపై కనక వర్షం కురిసింది. సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో ఈ ఏడాది ప్యాట్ కమిన్స్కు తిరుగులేకుండా పోయింది.

ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ సిరీస్ను కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా రిటైన్ చేసుకుంది. భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన ప్యాట్ కమిన్స్.. ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆసీస్కు తొలి డబ్ల్యూటీసీ టైటిల్ అందించాడు. ఈ టోర్నీ కోసం కమిన్స్ ఐపీఎల్ 2023 సీజన్కు దూరంగా ఉన్నాడు. ఫైనల్లో తన బౌలింగ్తో సత్తా చాటి భారత్ పతనాన్ని శాసించాడు.
అనంతరం వన్డే ప్రపంచకప్పై ఫోకస్ పెట్టిన కమిన్స్.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో వరుసగా రెండు పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును నడిపించి విజేతగా నిలబెట్టాడు. వరుసగా పది విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియాను ఫైనల్లో మట్టికరిపించి ఆసీస్ను విశ్వవిజేతగా నిలబెట్టాడు.

ఫైనల్ పిచ్ను బాగా రీడ్ చేసిన కమిన్స్ పరిస్థితులకు తగ్గట్లు ముందుగా బౌలింగ్ తీసుకొని ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్లో జాక్పాట్ ధర అందుకున్నాడు.
రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తీవ్రంగా పోటీపడ్డాయి. ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు పోటీపడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
ఈ రికార్డును ఆసీస్కే చెందిన మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. అతన్ని కేకేఆర్ రూ. 24.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.