టెస్ట్ క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 9 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు ఓ బ్యాటర్కు 150 ప్లస్ రన్స్ సమర్పించుకుంది. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా టీమిండియా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్లో డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) భారీ శతకంతో చెలరేగాడు. దాంతో టీమిండియా పేరిట ఈ చెత్త రికార్డు నమోదు అయ్యింది. డీన్ ఎల్గర్ కంటే ముందు ఈ ఏడాది టీమిండియాపై ఉస్మాన్ ఖవాజా(180), ట్రావిస్ హెడ్(163) 150 ప్లస్ రన్స్ చేశారు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఖవాజా తనదైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163) విధ్వంసకర శతకం నమోదు చేశాడు. ఈ ఏడాది ఈ ముగ్గురు బ్యాటర్లకు టీమిండియా 150+ ప్లస్ రన్స్ సమర్పించుకుంది.
చివరిసారిగా 2014లో టీమిండియా టెస్ట్ల్లో ముగ్గురు బ్యాటర్లకు 150 ప్లస్ రన్స్ ఇచ్చింది. డీన్ ఎల్గర్ సూపర్ సెంచరీతో ఈ మ్యాచ్పై సౌతాఫ్రికా పట్టు బిగించింది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లొ 400 ప్లస్ రన్స్ చేసిన సౌతాఫ్రికా.. ఇప్పటికే 200 ప్లస్ పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. క్రీజులో మార్కో జాన్సెన్(83 బ్యాటింగ్)తో పాటు కగిసో నండ్రే బర్లర్(0 బ్యాటింగ్) ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.