టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. మరో 14 రోజుల్లో ఈ ఏడాది ముగియనుండగా.. ఓ ఆటగాడిగా రోహిత్ శర్మకు కలిసొచ్చిన అంశం ఒక్కటి లేదు. వ్యక్తిగతంగా కాస్త మెరుగైన ప్రదర్శనే చేసినా.. కెప్టెన్గా మాత్రం విజయాలను అందుకోలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం వంటి ఘటనలతో రోహిత్ శర్మ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ను 2-1తో గెలుచుకొని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. కానీ క్వాలిఫయర్లోనే వెనుదిరిగి టైటిల్ అందించలేపోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఓటమిపాలై తృటిలో ఐసీసీ టైటిల్ చేజార్చుకున్నాడు.

అనంతరం వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్పై మాత్రమే ఫోకస్ పెట్టిన రోహిత్ శర్మ.. టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్లో భారత్ను విజేతగా నిలబెట్టి ఆశలు రేకెత్తించిన రోహిత్.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్లోనూ వరుస విజయాలతో జట్టును ముందుకు తీసుకెళ్లాడు.
కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వడంతో అభిమానులంతా కన్నీరు మున్నీరయ్యారు. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలు సాధించిన ఫైనల్ చేరిన టీమిండియాను దురదృష్టం వెంటాడింది. పిచ్ కండిషన్స్ పూర్తిగా ఆసీస్కు అనుకూలంగా మారడంతో టీమిండియా రన్నరప్గా నిలవాల్సి వచ్చింది.
ఈ పరాజయం అనంతరం ఆటకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ల సిరీస్తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంతలోనే రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను తొలగిస్తూ ప్రకటన వచ్చింది. హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ముంబై ఇండియన్స్ ప్రకటించింది. దాంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా 2023 తమకు కలిసి రాలేదని నిట్టూరుస్తున్నారు.
వ్యక్తిగతంగా మాత్రం రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. వన్డే, టెస్ట్ల్లో కలిసి 37 ఇన్నింగ్స్లు ఆడాడు. 51.28 సగటుతో 1795 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలున్నాయి. 2019 తర్వాత ఆ స్థాయిలో రోహిత్ శర్మ ఈ ఏడాదే బ్యాటింగ్ చేశాడు.