
హైదరాబాద్: ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో టీమిండియా దుమ్మురేపింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఓటమి మినహా ఆడిన అన్ని సిరీస్ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై బ్రిస్బేన్ టెస్టు విజయంతో 2021ని ప్రారంభించిన భారత్ జట్టు.. సౌతాఫ్రికా గడ్డపై తాజా సెన్సేషన్ విక్టరీతో ఈ ఏడాదిని ముగించింది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా గురువారం ముగిసిన తొలి టెస్టులో సమష్టిగా రాణించిన టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికపై టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్రకెక్కింది. అంతేకాకుండా ఈ గెలుపుతో మూడు టెస్ట్ల సిరీస్లో 1-0తో పై చేయి సాధించి మూడు దశాబ్దాల కలకు అడుగు దూరంలో నిలిచింది.
2021, జనవరిలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకున్న భారత్ జట్టు... అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. జూన్లో న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి పాలైన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో అర్దంతరంగా ఆగిపోయిన 5 టెస్ట్ల సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఓడి తృటిలో ఐసీసీ టైటిల్ను చేజార్చుకుంది. ఈ ఓటమే భారత్ను తీవ్రంగా బాధపెట్టింది. ఆ తర్వాత సొంతగడ్డపై అదే న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ను 1-0తో చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్ డ్రా కాగా.. రెండో మ్యాచ్లో భారత్ 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆగస్టులో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 151 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తాజాగా సెంచూరియన్ టెస్టులో విజయం సాధించడం ద్వారా.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో గెలవలేమనే అపప్రదని భారత్ జట్టు పూర్తిగా తుడిచిపెట్టేసింది. 2018లోనూ జొహనెస్బర్గ్, నాటింగ్హామ్, అడిలైడ్, మెల్బోర్న్లో టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా.. SENA దేశాలకి సవాల్కి విసిరింది.
తాజా మ్యాచ్లో 305 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్(77), టెంబా బవుమా(35 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50), మహమ్మద్ షమీ(3/63) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), రవిచంద్రన్ అశ్విన్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది.