
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత యశ్పాల్ శర్మ(66) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ అయిన 66 ఏళ్ల యశ్పాల్.. కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఓ సభ్యుడు. ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్తో జరిగిన కీలక సెమీ ఫైనల్లో యశ్పాల్ 61 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్గా యశ్పాల్ నిలిచారు. 83 వరల్డ్కప్ లీగ్ స్టేజ్లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో యశ్పాల్ 89 రన్స్ చేశాడు.
1978లో పాకిస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యశ్పాల్ శర్మ.. భారత్ తరపున 1978-83 మధ్య కాలంలో 37 టెస్టుల్లో 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. టెస్టుల్లో 2 సెంచరీలు ఉన్నాయి. యశ్పాల్ మంచి ఫీల్డర్ కూడా. కొన్నేళ్ల పాటు ఆయన జాతీయ సెలెక్టర్గా కూడా పని చేశారు. 1983 వరల్డ్కప్ ఆడిన సభ్యుల్లో.. మరణించిన తొలి క్రికెటర్ యశ్పాల్ శర్మ కావడం విషాదకరం. ఇక యశ్పాల్ అకాల మరణం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మాజీ, ప్రస్తుత క్రికెటర్లు యశ్పాల్కు నివాళులర్పిస్తున్నారు.